Crypto News: క్రిప్టో కరెన్సీలపై ఉక్కుపాదం..! కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ..
Crypto News: క్రిప్టో కరెన్సీలు, వర్చువల్ డిజిటల్ ఆస్తుల విషయంలో కేంద్రం అణచివేత ధోరణిని కొనసాగిస్తోంది. దేశంలో సామాన్య ఇన్వెస్టర్లను వీటికి దూరంగా ఉంచేందుకు ఇప్పటికే అనేక చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.
డిజిటల్ ఆస్తుల పర్యవేక్షణను కఠినతరం చేసేందుకు కేంద్రం తాజా చర్యగా క్రిప్టో ట్రేడింగ్, సేఫ్టీ సంబంధిత ఆర్థిక సేవలను మనీలాండరింగ్ నిరోధక చట్టం పరిధిలోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసింది.
భారత ప్రభుత్వ తాజా గెజిట్ ప్రకారం క్రిప్టో ఎక్స్ఛేంజీలు, మధ్యవర్తులు ఇప్పుడు తమ క్లయింట్లు, ప్లాట్ఫారమ్ వినియోగదారుల KYCని తప్పక నిర్వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా అనుమానాస్పద ట్రాన్సాక్షన్లను గుర్తించినట్లయితే వాటి వివరాలను సదరు ఎక్స్ఛేంజీలు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇండియాకు తెలియజేయాల్సి ఉంటుంది. VDAలో వ్యవహరించే సంస్థలు PMLA-బ్యాంకుల క్రింద "రిపోర్టింగ్ ఎంటిటీ"గా పరిగణించబడతాయని నోటిఫికేషన్ స్పష్టం చేసింది.
దేశంలోని ఆర్థిక సంస్థలు, రియల్ ఎస్టేట్, ఆభరణాల రంగాల్లో నిమగ్నమైన సంస్థలు, కాసినోలు ఇకపై 'రిపోర్టింగ్ ఎంటిటీలు' అని గెజిట్ ద్వారా వెల్లడైంది. అందువల్ల చట్టం ప్రకారం.. ప్రతి రిపోర్టింగ్ సంస్థ అన్ని లావాదేవీల రికార్డులను నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే క్రిప్టో ఎంటిటీలు కూడా రికార్డులను నిర్వహించటం తప్పనిసరి. బ్యాంకులు లేదా ఇతర నియంత్రిత సంస్థలు అనుసరించే విధంగా మనీలాండరింగ్ నిరోధక ప్రమాణాలకు అనుసరించాలని డిజిటల్-ఆస్తి ప్లాట్ఫారమ్లను వివరాలను అడగటం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధోరణికి అనుగుణంగా తీసుకోబడిన నిర్ణయంగా తెలుస్తోంది.