యూకే కోర్టులో విజయ్ మాల్యాకు షాక్, బ్యాంకులకు హక్కు లేదన్న వాదనకు నో
భారత బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాకు బ్రిటన్ హైకోర్టులో చుక్కెదురైంది. ఎస్బీఐ నేతృత్వంలోని భారతీయ బ్యాంకుల కన్సార్టియం వేసిన పిటిషన్ను లండన్ హైకోర్టు అనుమతించింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రుణాల కోసం హామీగా పెట్టుకున్న ఆస్తులపై బ్యాంకులకు ఎలాంటి హక్కు లేదన్న మాల్యా న్యాయవాదుల వాదనను కోర్టు తోసిపుచ్చింది.
ఈ కేసుపై తుది విచారణను జూలై 26వ తేదీకి వాయిదా వేసింది. దీంతో విజయ్ మాల్యా నుండి రావాల్సిన రూ.14,000 కోట్ల బకాయిలను రాబట్టుకునేందుకు బ్యాంకులు చేస్తోన్న ప్రయత్నాలు త్వరలో సఫలం అవుతాయని భావిస్తున్నారు. మాల్యాకు చెందిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కోసం బ్యాంకులు ఈ రుణాలు అందించాయి.
చీఫ్ ఇన్సాల్వెన్సీ అండ్ కంపెనీస్ కోర్టు (ICC) జడ్జి బ్రిగ్స్ ఈ కేసులో మాల్యా తరఫు లాయర్ పిలిప్ మార్షల్ వాదనలను వినేందుకు జూలై 26వ తేదీన అవకాశం ఇచ్చారు. మాల్యాను భారత్కు రప్పించేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తోన్న విషయం తెలిసిందే.