ఇవి కొనండి... మీకు అది ఇస్తాం: ఇండియాకు ట్రంప్ ఆఫర్!
డోనాల్డ్ ట్రంప్ అంటేనే తింగరితనంతో కూడిన బిజినెస్ మ్యాన్. అయన అమెరికా ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి అటు అమెరికన్ల కు ఇటు ప్రపంచ దేశాలకు షాక్ ల మీద షాక్ లు ఇస్తూనే ఉన్నాడు. ఉద్యోగాలు, వీసాలు, వాణిజ్యం ఇలా ఏ రంగంలో తీసుకున్నా అందులో ఆయనదైన ప్రత్యేక శైలి కనిపిస్తుంది. తాజాగా అలాంటి మరో షాకింగ్ ప్రతిపాదన ఒకటి ట్రంప్ ఇండియాకు ఇచ్చారట. అదేమంటే... అమెరికాలో ఏళ్ళ తరబడి నిలువ ఉన్న పౌల్ట్రీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తే.... ఇండియా కు జెనెరలైజ్డ్ సిస్టం ఆఫ్ ప్రిఫరెన్సెస్ (జీ ఎస్ పీ ) హోదా కల్పిస్తామని ట్రంప్ చెప్పారట. ఇంతకూ ఈ హోదాతో ఏం జరుగుతుందంటే... సుమారు 5.6 బిలియన్ డాలర్ల విలువైన ఎంపిక చేసిన ఎగుమతులను ఇండియా నుంచి ఎలాంటి సుంకాలు లేకుండా అమెరికాకు ఎగుమతి చేయవచ్చు. గతంలో ఇండియాకు ఈ హోదా ఉండేది. కానీ ట్రంప్ గారి దయవల్ల గతేడాది నుంచి దానిని తొలగించారు. ఈ మేరకు ప్రముఖ వార్తా ఏజెన్సీ రాయిటర్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే స్వతహాగా రియల్ ఎస్టేట్ వ్యాపారి ఐన డోనాల్డ్ ట్రంప్ కు డీల్స్ అంటే మహా ఇష్టం. అందుకే, అయన ప్రస్తుతం భారత్ ముందు ఈ ప్రతిపాదన ఉంచారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఫ్రోజెన్ చికెన్ కోసం పట్టు...
ఇండియన్స్ కు చికెన్ లెగ్ పీసులంటే చాలా ఇష్టం. కానీ అమెరికాలో అసలు లెగ్ పీసులు తినరు. అందుకే, కొన్ని ఏళ్లుగా అక్కడ టన్నుల కొద్దీ చికెన్ లెగ్ పీసులు పేరుకుపోయాయి. వాటిని అమెరికా కోల్డ్ స్టోరేజీస్ లో భద్రపరుస్తోంది. ఇది చాలా ఖర్చుతో కూడిన పని. అందుకే, ఆ ఫ్రోజెన్ చికెన్ (నిల్వ చేసిన కోడి మాంసం) సహా ఇతర పౌల్టీ ఉత్పత్తులు ఎలాగైనా ఇండియాకు అంటగట్టాలని అమెరికా భావిస్తోంది. ఎప్పటినుంచో ఈ ప్రతిపాదన ఉన్నప్పటికీ, మన దేశంలో లక్షలాది పౌల్ట్రీ రైతులకు దీంతో నష్టం జరుగుతుందని భారత్ ఈ ప్రతిపాదనకు నో చెబుతోంది. కానీ ట్రంప్ ఇప్పుడు మరో ట్రేడ్ డీల్ తో దీనిని ముడిపెట్టి ఎలాగైనా సరే పేరుకు పోయిన తమ చికెన్ లెగ్ పీసుల ను ఇండియా కు పంపించేయాలని తలపోస్తున్నారు. అందుకే, సుమారు 6 బిలియన్ డాలర్ల విలువైన తమ ఫ్రోజెన్ పౌల్ట్రీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తే... టారిఫ్ లేకుండా దాదాపు అంతే మొత్తంలో ఎగుమతులు చేయగల జీ ఎస్ పీ హోదాను పునరుద్ధరిస్తామని ట్రంప్ చెబుతున్నారు.
ఆల్మండ్స్ పైన సుంకాల తగ్గింపు...
ఎప్పటినుంచో ట్రంప్ మన దేశం అమెరికా ఉత్పత్తులపై విధించే టారిఫ్ లపై గుర్రుగా ఉన్నారు. లగ్జరీ బైకులను విక్రయించే హార్లే డేవిడ్సన్ కు ఇండియాలో గతంలో 100% దిగుమతి సుంకం విధించే వారు. ట్రంప్ కోరిక మేరకు దానిని 50% నికి తగ్గించారు. అయినా సరే అయన మనసు మారలేదు. ఇంకా గుర్రుగానే ఉన్నారు. ఇంకా సుంకాలను తగ్గించాలని కోరుతున్నారు. అదే సమయంలో కొత్త ఉత్పత్తులను తెరపైకి తీసుకొస్తున్నారు. పౌల్ట్రీ సహా అనేక ఉత్పత్తులపై ట్రంప్ రకరకాల మెలికలు పెడుతున్నారు. జీ ఎస్ పీ హోదాను రద్దు అనంతరం ఇండియా కూడా కొన్ని రకాల అమెరికా ఉత్పత్తులపై సుంకాలను పెంచింది. అందులో ఆల్మండ్స్ సహా అమెరికన్ ఆపిల్స్, వాల్ నట్స్ వంటి వ్యవసాయ ఉత్పత్తులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం వాటిపై కూడా సుంకాలు తగ్గించాలని అమెరికా ప్రతిపాదిస్తోంది.
ఫిబ్రవరి లో ట్రంప్ భారత పర్యటన...
అమెరికా ప్రెసిడెంట్ ఐన తర్వాత మూడేళ్లకు డోనాల్డ్ ట్రంప్ తొలిసారి భారత్లో పర్యటించనున్నారు. ఫిబ్రవరి చివర్లో అయన ఇండియాకు రానున్నారు. ఇప్పటికే రెండు దేశాల మధ్య ఈ మేరకు సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నారు. ట్రంప్ పర్యటనకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రంప్ తొలిసారి ఇండియా వస్తుండటంతో, అయన పౌల్ట్రీ దిగుమతులు సహా ఇతర అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తగ్గించాలని పట్టుబట్టే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ప్రధాని మోడీకి అమెరికాలో ఇటీవల ఘన స్వగతం లభించిన విషయం తెలిసిందే. అలాగే ఇండియా లో కూడా ట్రంప్ కు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ, ట్రంప్ ఒత్తిళ్లకు భారత్ తలోగ్గుతుందా లేదా అన్నది తేలాలంటే మాత్రం... మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.