UP Investors summit 2022: యోగి రాష్ట్రానికి రూ.80,000 కోట్ల పెట్టుబడులు: బ్రేకప్ ఇదే
లక్నో: ఉత్తర ప్రదేశ్ నక్కతోక తొక్కింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో భారతీయ జనతా పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత పెట్టుబడులు ప్రవహిస్తోన్నాయి. ఆ రాష్ట్రం దశ-దిశను మార్చేలా ఉన్నాయి. తాజాగా నిర్వహించిన ఉత్తర ప్రదేశ్ పెట్టుబడుల సదస్సు-2022 సందర్భంగా పారిశ్రామికవేత్తలు పరస్పర అంగీకార ఒప్పందాలను ఆ రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్నారు. వాటి విలువ 80,000 కోట్ల రూపాయలు. 1,430 ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి.
దీనివల్ల అయిదు లక్షల మందికి ప్రత్యక్షంగా.. 20 లక్షల మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. యూపీ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2022ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆదిత్యబిర్లా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, అదాని, దాల్మియా వంటి పలు బడా పరిశ్రమల సంస్థల అధినేతలు, పలులువురు పారిశ్రామికవేత్తలు ఇందులో పాల్గొన్నారు.
దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదాని సారథ్యంలోని అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. దీనికోసం పరస్పర అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని విలువ 5,122 కోట్ల రూపాయలు. హిరనందాని గ్రూప్ కూడా డేటా సెంటర్ను నెలకొల్పడానికి అవసరమైన ఎంఓయూను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంతో కుదుర్చుకుంది. 9.100 కోట్ల రూపాయలతో దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.
మైక్రోసాఫ్ట్ కంపెనీ తన ప్రధాన కార్యాలయాన్ని యూపీలో ఏర్పాటు చేయనుంది. 2,186 కోట్ల రూపాయలతో దీన్ని నెలకొల్పుతామని పేర్కొంది. సిమెంట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్కు చెందిన దాల్మియా గ్రూప్ 600 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టనుంది. కోకాకోలా-700 కోట్ల రూపాయలు, ఏసీసీ సిమెంట్స్-600.80 కోట్ల రూపాయలతో గ్రైండింగ్ ప్లాంట్ను నెలకొల్పడానికి ఎంఓయూను కుదుర్చుకుంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీలు 4,459 కోట్ల రూపాయలతో ఎంఓయులను పరస్పరం బదలాయించుకున్నాయి.
ఆగ్రా, అలీగఢ్, అమేథీ, అయోధ్య, బారాబాంకీ, బరేలీ, చందౌలీ, ఇటావా, ఫతేపూర్, ఫిరోజాబాద్, గౌతమ్ బుద్ధనగర్, ఘజియాబాద్ జిల్లాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలను నెలకొల్పడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన పారిశ్రామికాభివృద్ధి ప్రాజెక్టుల గురించి మోడీ- ఈ సదస్సులో వివరించారు.