నిరుద్యోగం, అంటువ్యాధులే సవాల్, మూడో స్థానానికి ఆర్థిక సంక్షోభం
ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ ఎగ్జిక్యూటివ్లకు నిరుద్యోగం ప్రధాన ఆందోళనకర అంశంగా మారిందని, తర్వాత అంటువ్యాధులు ఇబ్బందికరంగా ఉన్నాయని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (WEF) నివేదిక పేర్కొంది. కరోనా మహమ్మారి రెండోసారి పునరావృతం అవుతుందనే అంశం ఆందోళనకరమేనని తెలిపింది. 2019 సంవత్సరంలో అతిపెద్ద ముప్పుగా నిలిచిన ఆర్థిక సంక్షోభం ఈసారి మూడో స్థానానికి పరిమితమైంది. వ్యాపార నిర్వహణకు ఆయా ప్రాంతాల్లో ఎదురవుతున్న ప్రధాన సమస్యలు లేదా ముప్పు ఏమిటి అనే అంశాలపై WEF సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.
దక్షిణ ఆసియాలోని అన్నిప్రాంతాల్లో మొదటి పది ప్రధాన సమస్యల్లో అంటువ్యాధులు ఉన్నాయి. కరోనా మహమ్మారితో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యంపై ఆందోళన నెలకొనడం ఇందుకు కారణం. ఉగ్రవాద దాడులు, ప్రకృతి వైపరీత్యాలు, రాజకీయ సంక్షోభాలు సహా మొత్తం 30 ముప్పులను ఈ సర్వే గుర్తించింది.
తూర్పు ఆసియా, పసిఫిక్, ఐరోపా, లాటిన్ అమెరికా, కరేబియన్, మధ్య ప్రాచ్య, ఉత్తర ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణాసియా దేశాల్లో ఈ సర్వేను నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా 127 దేశాల్లో 12,000 మందికి పైగా బిజినెస్ లీడర్స్ ఈ సర్వేలో పాల్గొన్నారు. అక్టోబర్ 20 నుండి 23 మధ్య వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఇనాగరల్ జాబ్స్ రీసెట్ సమ్మిట్ ఉంది. దీనికి ముందు ఈ సర్వేను వెలువరించింది. ప్రమాదకర జాబితాలో ఆర్థిక సంబంధ, ప్రకృతి వైపరీత్యాలు వంటివి ఉన్నాయి.