ఎయిరిండియా ఫ్లాష్ సేల్: రూ.799కే దేశీయ రూట్లలో ప్రయాణించండి
న్యూఢిల్లీ: ఇప్పటికే నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ విమానాయాన సంస్థ ఎయిరిండియా తమ ప్రయాణికుల కోసం బంపరాఫర్ ప్రకటించింది. దేశీయ మరియు అంతర్జాతీయ సర్వీసులపై ఫ్లాష్ సేల్ పేరుతో డిస్కౌంట్లు ప్రకటించింది. ఫ్లాష్ సేల్ ఆఫర్ కింద ఎయిరిండియా దేశీయ రూట్లలో టికెట్ ప్రారంభ ధరను రూ.799గా ప్రకటించింది. ఇక అంతర్జాతీయ రూట్లలో వెళ్లే తమ సర్వీసులకు ప్రారంభ ధరను రూ. 4,500గా ప్రకటించింది.
పరిమిత సంఖ్యలోనే టికెట్లను ఎయిరిండియా సంస్థ విక్రయిస్తోంది. ఇక ఈ భారీ ఆఫర్ పొందాలంటే ప్రయాణికులు ఈ రోజు నుంచే టికెట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 17 రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు ఈ ఆఫర్ ఉంటుందని ఎయిరిండియా సంస్థ తన వెబ్సైట్పై పొందుపర్చింది. ఇక దేశీయ ప్రయాణాలకు సీట్లను ఎకానమీ సెక్షన్లో కేటాయించింది. ఇక ఇంటర్నేషనల్ ప్రయాణికులకు సీట్లను అన్ని విభాగాల్లో కేటాయించింది. ఇదిలా ఉంటే సౌదీ అరేబియాకు వెళుతున్న విమానాలకు మాత్రం ఈ ఆఫర్ వర్తించదని తన వెబ్సైట్లో ఎయిరిండియా స్పష్టం చేసింది.
ఇక లగేజీ అలవెన్స్లు సెపరేటుగా ఉంటాయని ఎయిరిండియా తెలిపింది. వాటి నిబంధనలు మార్చడం లేదని కేవలం ప్రయాణికుల టికెట్ ధర మాత్రమే ఆఫర్ కింద ఇస్తున్నట్లు వెల్లడించింది. ఇక ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 17 వరకు టికెట్స్ బుక్ చేసుకున్నవారు ఫిబ్రవరి 18 నుంచి సెప్టెంబర్ 30, 2020 మధ్య ప్రయాణించాల్సి ఉంటుదని వెల్లడించింది. ఇక ఈ ఏడాది ఎయిరిండియాలో తక్కువ ధరకే ప్రయాణించి ఎంజాయ్ చేయండి. ఎయిరిండియా నష్టాల బాట నుంచి గట్టెక్కేందుకు ఇలాంటి ఆఫర్లు చాలా ప్రకటిస్తోంది. ఆఫర్లు ఇవ్వడం ద్వారా ప్రయాణికుల రద్దీని పెంచి తద్వారా రెవిన్యూ జనరేట్ చేయాలని ఎయిరిండియా భావిస్తున్నట్లు సమాచార.