Rythu Bharosa: అన్నదాతలకు గుడ్ న్యూస్.. రైతుల ఖాతాల్లో రూ.9 వేల కోట్లు జమ..!
రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద విడతల వారీగా నిధులు విడుదల చేస్తోంది. జూన్ 30న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మొదటి విడత రైతు భరోసా నిధులు విడుదల చేశారు. ఆ తర్వాత క్రమం తప్పకుండా విడతల వారీగా రైతు భరోసా నిధులు అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. జూలై 7న 7 నుంచి 8 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేసింది. ఏడో విడతలో 4.32 లక్షల ఎకరాల సాగుభూమికి సంబంధించి 8,831 మంది రైతులు లబ్ధి పొందారు. ఈ విడతలో మొత్తం రూ.259.73 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. సోమవారం ఆరో విడత రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసింది.
7 ఎకరాల లోపు సాగు భూమి ఉన్న లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులను జమ చేసింది. 92,729 మంది అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.354.96 కోట్లను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) పద్ధతిలో నేరుగా జమ చేసినట్లుగా వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. శనివారం ఐదో విడత రైతు భరోసా నిధులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసిన సంగతి తెలిసిందే. ఐదో విడతలో భాగంగా 5 నుంచి 6 ఎకరాల లోపు ఉన్న రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.545.41 కోట్లను జమ చేశారు. ఐదో విడతలో 1.69 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. శుక్రవారం నాల్గో దఫా రైతు భరోసా నిధులు అన్నదాతల ఖాతాల్లో జమ అయ్యాయి.

ఈ విడతలో 4.41 లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.1188 కోట్లు జమ చేశారు. మూడో విడతలో భాగంగా అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో రూ.1,330 కోట్లను జమ చేశారు. ఈ విడతలో 6.39 లక్షల మంది రైతులు లబ్ధి పొందినట్లు వివరించారు. జూన్ 30న మొదటి విడతలో రెండు ఎకరాల వరకు భూమి ఉన్న 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,482 కోట్లను జమ చేశారు. జూలై 1న రెండో విడతలో భాగంగా 2 నుంచి మూడు ఎకరాలు ఉన్న 10.68 లక్షల మంది అన్నదాతల ఖాతాల్లో దాదాపు రూ.1590 కోట్లు జమ అయింది. 26.50 లక్షల ఎకరాలకు రెండో విడత రైతు భరోసా విడుదల చేశారు.
రైతు భరోసా కింద మొత్తం రూ.9 వేల కోట్లను దశలవారీగా 73.32 లక్షల మంది అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తామని ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ రోజు చివరి విడత రైతు భరోసా నిధులు అన్నదాతల ఖాతాల్లో జమ కానున్నాయి. ఇందుకు సంబంధించి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. రైతు ఆశీర్వాద సభ కోసం ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం మత్కేపల్లి క్రాస్ రోడ్ వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సభలో 11 వేలకు పైగా రైతులు పాల్గొననున్నారు. ఈ సభలోనే చివరి విడత రైతు భరోసా నిధులు విడుదల చేస్తారు.


Click it and Unblock the Notifications