Maruti Suzuki: ఒక్క రోజే రూ.856 పెరిగిన మారుతీ సుజుకీ స్టాక్.. !
దేశంలోని అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ మారుతీ సుజుకీ స్టాక్ మంగళవారం ట్రేడింగ్ సెషన్లో భారీగా పెరిగింది. జూలై 9, 2024 సెషన్లో, మారుతీ సుజుకి స్టాక్ 7 శాతం లేదా రూ. 856 పెరిగి రూ.12,959.95కి చేరుకుంది. హైబ్రిడ్ కార్ల రిజిస్ట్రేషన్పై పన్నుకు సంబంధించి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో మారుతీ స్టాక్ పెరిగింది. ఉత్తరప్రదేశ్లో పర్యావరణానికి మేలు చేసే హైబ్రిడ్ కార్లపై రిజిస్ట్రేషన్ పన్నును పూర్తిగా రద్దు చేయాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయించింది.
యోగి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఉత్తరప్రదేశ్లో హైబ్రిడ్ కార్ల ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. రాష్ట్రంలో విక్రయించే చిన్న నుంచి పెద్ద హైబ్రిడ్ కార్ల ధరలు రూ.50,000 నుంచి రూ.3.50 లక్షల వరకు తగ్గవచ్చని భావిస్తున్నారు. యోగి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం హైబ్రిడ్ కార్లపై ఎక్కువ దృష్టి సారించిన మారుతీ సుజుకికి పెద్ద ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. కంపెనీకి చెందిన హైబ్రిడ్ కార్లు చౌకగా ఉంటే, అది అమ్మకాలు పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో కంపెనీ లాభాలు పెరిగే అవకాశం ఉంది.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మారుతీ సుజుకీ స్టాక్లో జంప్ కనిపించింది. గత సెషన్లో ఈ షేరు రూ.12,104 వద్ద ముగిసింది. ఇది మంగళవారం సెషన్లో రూ.12,325 వద్ద ప్రారంభమై.. 7 శాతం జంప్తో రూ.12,960కి చేరుకుంది. మారుతీ సుజుకీ మార్కెట్ క్యాప్ రూ.4 లక్షల కోట్లు దాటింది. 2024లో మారుతీ సుజుకీ షేర్లు 25 శాతం పెరిగాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ. 10 లక్షల కంటే తక్కువ ధర ఉన్న కార్లపై 8 శాతం రోడ్డు పన్నును వసూలు చేస్తుంది.
అయితే ఈ ఏడాది ప్రారంభంలో, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలపై రిజిస్ట్రేషన్ పన్నును సున్నాకి తగ్గించింది. మారుతీ సుజుకితో పాటు, టయోటా, హోండా కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయంతో ప్రయోజనం పొందుతాయి.


Click it and Unblock the Notifications


