అతి పెద్ద ఆర్థిక సంక్షోభం రాబోతోంది.. డబ్బులు అసలు పుట్టవు.. కోటక్ బ్యాంక్ అధినేత ఉదయ్ కోటక్ కీలక వ్యాఖ్యలు
ప్రముఖ బ్యాంకర్, కోటక్ బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ భవిష్యత్తులో రాబోయే ఆర్థిక సవాళ్లపై భారత పరిశ్రమ రంగాన్ని హెచ్చరించారు. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని, ఈ 'షాక్' తట్టుకోవడానికి భారతదేశం ముందస్తుగా సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన సీఐఐ (CII) వార్షిక వ్యాపార సదస్సులో పాల్గొన్న ఆయన.. ప్రస్తుత పరిస్థితులపై తన గంభీరమైన విశ్లేషణను పంచుకున్నారు.
గత రెండు నెలలుగా ఇంధన ధరలపై యుద్ధ ప్రభావం అంతగా కనిపించనప్పటికీ, ఇకపై ఆ పరిస్థితి ఉండబోదని కోటక్ అభిప్రాయపడ్డారు. పెరిగిన చమురు ధరల ప్రభావం వినియోగదారులపై పడటం ప్రారంభమవుతుందని, ఇది రవాణా, ఇతర వస్తువుల ధరల పెరుగుదలకు దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్న భారతీయ కుటుంబాలు ఈ ధరల పెరుగుదల వల్ల తీవ్రంగా ఇబ్బంది పడతాయని Uday Kotak హెచ్చరించారు. మనం ఆ షాక్కు చాలా సమీపంలో ఉన్నాము, అది సంభవించే వరకు వేచి ఉండకుండా ముందే సన్నద్ధం కావాలి" అని ఆయన స్పష్టం చేశారు.

పరిశ్రమ వర్గాలను ఉద్దేశించి మాట్లాడుతూ.. మనం ప్రస్తుతం ఉన్న 'కంఫర్ట్ జోన్' (సురక్షిత వాతావరణం) నుండి బయటకు రావాలని కోటక్ సూచించారు. దేశం మనకేం చేస్తుందని ఎదురుచూడటం కంటే, దేశం కోసం మనం ఏం చేయగలమనే ఆలోచనతో ముందుకు సాగాలని ఆయన అన్నారు. భారతదేశం అద్భుతమైన వృద్ధిని సాధిస్తున్నప్పటికీ, ప్రస్తుత ప్రపంచ అనిశ్చితి నేపథ్యంలో మనలో కొంత 'జాగ్రత్త' లేదా ఆందోళన ఉండటం మేలు చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
ఇంధన భద్రత విషయంలో భారత్ వేగంగా అడుగులు వేయాలని, ముఖ్యంగా పునరుత్పాదక ఇంధన వనరులపై దృష్టి సారించాలని ఆయన కోరారు. ఈ విషయంలో చైనాను ఉదాహరణగా చూపిస్తూ, అక్కడ 60 శాతం వాహనాలు ఎలక్ట్రిక్గా మారాయని, మనం కూడా అంతటి వేగంతో లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. కేవలం సొంత కంపెనీల లాభాలు లేదా లాబీయింగ్ గురించి ఆలోచించకుండా, దేశ ప్రయోజనాల కోసం పెద్ద ఎత్తున మార్పులు తీసుకురావాలని వ్యాపార సంస్థలను కోరారు.
చివరగా పొదుపుగా ఖర్చు చేయడంపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిరత దృష్ట్యా ఆదాయానికి మించి ఖర్చు చేయకుండా, భవిష్యత్తు అవసరాల కోసం సిద్ధంగా ఉండటమే దేశానికి శ్రీరామరక్ష అని ఉదయ్ కోటక్ తన ప్రసంగాన్ని ముగించారు.


Click it and Unblock the Notifications
