Crypto Bill: ఉపసంహరణకు సమయం, వేచి చూడాలి
క్రిప్టో బిల్లు విషయంలో క్రిప్టో కరెన్సీ ప్లేయర్స్ అప్పుడే ఆందోళన చెందడం తొందరపాటు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. క్రిప్టో బిల్లు ఆందోళన కారణంగా నిన్న బిట్ కాయిన్, ఎథేరియం సహా వివిధ డిజిటల్ కాయిన్స్ భారీగా నష్టపోయిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత కాస్త క్లారిటీ రావడంతో కొద్దిగా కోలుకున్నాయి. వర్చువల్ కరెన్సీపై నిషేధం లేదా నియంత్రణ బిల్లుకు సంబంధించి భయాందోళన సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓ సమయంలో బిట్ కాయిన్ 25 శాతం, ఎథేరియం 30 శాతం, టెథేర్ 20 శాతం మేర నష్టపోయినప్పటికీ, ఆ తర్వాత కోలుకున్నాయి. క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు,2021ని శీతాకాలసమావేశాల్లో లోకసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు నేపథ్యంలో క్రిప్టోపై ఆందోళనతో డిజిటల్ కాయిన్ నిన్న నష్టపోయింది.
భారీగా పడిపోయి, మళ్లీ కోలుకొని
భారత్లో ప్రయివేటు క్రిప్టోకరెన్సీ ట్రాన్సాక్షన్స్ను నియంత్రించడంతో పాటు అధీకృత డిజిటల్ కరెన్సీని ఆవిష్కరించేందుకు ఈ బిల్లును కేంద్రం ప్రవేశ పెడుతోంది. బిట్ కాయిన్, ఎథేరియం వంటి క్రిప్టో కరెన్సీల వ్యాల్యూ భారీగా పడిపోయాయి. క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ ధర 25 శాతం, ఎథేరియం ధర 30 శాతం క్షీణించి, ఆ తర్వాత కోలుకున్నాయి. క్రిప్టో ఎక్స్ఛేంజీ వజీర్-ఎక్స్లో ఒక బిట్ కాయిన్ ధర రూ.46 లక్షల నుండి రూ.36 లక్షలకు పడిపోయినా మళ్లీ కోలుకుని రూ.40 లక్షల వద్ద ట్రేడ్ అయింది. ఎథేరియం రూ.3.4 లక్షల నుండి రూ.2.4 లక్షలకు క్షీణించి, ఆ తర్వాత కోలుకొని రూ.3 లక్షల వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయంగా బిట్ కాయిన్, ఇతర క్రిప్టోల ధరలు మనదేశ ఎక్స్ఛేంజీల్లో మాదిరి క్షీణించలేదు. బిట్ కాయిన్ ధర 2.6 శాతం తగ్గినా, మళ్లీ కోలుకుని 57,000 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ లెక్కన చూస్తే కేంద్రం బిల్లు ప్రతిపాదన ప్రభావం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగించి, పెద్దఎత్తున అమ్మకాలు వెల్లువెత్తినట్లు తేలింది.
ఉపసంహరణకు గడువు
ప్రయివేటు క్రిప్టోల్లో పెట్టుబడులు పెట్టినవారు, నిర్దేశిత గడువులోగా ఉపసంహరించుకునే వెసులుబాటు కల్పిస్తారని కూడా వార్తలు వచ్చాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి వసూలు చేసే విధంగా క్రిప్టో కరెన్సీ ఆదాయాన్ని పన్ను పరిధిలోకి తీసుకు రావొచ్చునని అంటున్నారు.
క్రిప్టోను ఫైనాన్షియల్ అసెట్గా పరిగణించే ఆలోచన ప్రభుత్వానికి ఉందని, తద్వారా చిన్న ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల మాట. ప్రపంచవ్యాప్తంగా 6వేలకు పైగా క్రిప్టోలు ఉన్నాయి. ఇందులో బ్లాక్ చైన్ టెక్నాలజీ-మైనింగ్ ఆధారిత డీసెంట్రలైజ్డ్ ప్రేమ్ వర్క్తో 10 నుండి 15 కంటే ఎక్కువ ఉండవు. వీటికి ప్రభుత్వం మినహాయింపు ఇవ్వవచ్చునని అంటున్నారు. ఎంపిక చేసిన క్రిప్టోల ట్రేడింగ్కు మాత్రమే అనుమతి ఇచ్చి, వాటిని మార్పిడి సాధనాలుగా వినియోగించేందుకు వీల్లేకుండా నిషేధించవచ్చు.
వేచి చూడాలి
క్రిప్టో బిల్లు పైన పరిశ్రమ ఆచితూచి స్పందిస్తోంది. ప్రభుత్వ హడావుడి నిర్ణయాలు తీసుకోరాదని కోరింది. ప్రయివేటు క్రిప్టోను నిషేధించాలని ఉద్దేశ్యం ఉన్నప్పటికీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ పరిజ్ఞానం, దాని ప్రయోజనాలను అందిపుచ్చుకోవడానికి కొన్ని మినహాయింపులు ఇవ్వాలనే ఆలోచన ఉందని చెబుతున్నారు. ఏ వ్యక్తి క్రప్టో మైనింగ్, ఉత్పత్తి-జారీ, కొనుగోలు-అమ్మకం, బదలీ, వాటితో ఒప్పందాలు చేయకుండా లేదా కలిగి ఉండకుండా నిరోధించేలా బిల్లు ఉంటుందని అంటున్నారు. ప్రభుత్వ విధానంపై క్రిప్టో ఇన్వెస్టర్లు వేచి చూడాలని పరిశ్రమ చెబుతోంది. ఇన్వెస్టర్ల ప్రయోజనాలు రక్షించాలని కూడా అంటున్నారు.