భారత్ దెబ్బ మామూలుగా లేదు, ఆ ఒక్క చైనా కంపెనీకే రూ.45,000 కోట్ల నష్టం
సరిహద్దుల్లో చైనా రెచ్చిపోయింది. ఆ చర్యలకు భారత్ ధీటుగా సమాధానం చెబుతూనే మరోవైపు డిజిటల్ స్ట్రైక్ చేసింది. చైనాకు చెందిన 59 యాప్స్ పైన భారత్ నిషేధం విధించింది. ఒక్కసారిగా ఇన్ని యాప్స్పై నిషేధం విధించడంతో అందరూ నివ్వెరపోయారు. రోడ్స్ కాంట్రాక్ట్ నుండి కూడా చైనాను పక్కన పెట్టింది. మోడీ ప్రభుత్వం నిర్ణయాన్ని అమెరికా సహా చాలా దేశాలు స్వాగతిస్తున్నాయి. నిషేధించిన యాప్స్లలో టిక్టాక్, షేరిట్, హెలో వంటివి బాగా ప్రాచుర్యం పొందాయి. టిక్టాక్, హెలో మాతృసంస్థ బైట్ డ్యాన్స్.
చైనా దూకుడుపై భారత్ ధైర్యం... సూపర్: 59 యాప్స్ నిషేధంపై నిక్కీ హేలీ ప్రశంస
రూ.45వేల కోట్ల నష్టం
59 యాప్స్ బ్యాన్ చేయడంతో చైనాకు చెందిన ఈ సంస్థలకు భారీ నష్టం వాటిల్లుతోంది. టిక్టాక్, హెలో మాతృసంస్థ బైట్ డ్యాన్స్కే ఏకంగా రూ.45వేల కోట్ల మేరకు నష్టపోతోందని అంచనా. టిక్టాక్ బ్యాన్ వల్ల చైనాకు వచ్చే నష్టం ఏమీ లేదని, డిసెంబర్ క్వార్టర్లో కేవలం రూ.25 కోట్ల రెవెన్యూ జనరేట్ అయిందని రాజ్దీప్ ఇటీవల పేర్కొన్నారు. తద్వారా బ్యాన్ చేయడం వల్ల చైనా కంపెనీలకు వచ్చిన నష్టమేమీ లేదని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ స్వయంగా చైనా ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్.. వేల కోట్ల నష్టమని పేర్కొంది.మొత్తంగా 59 యాప్స్కు సంబంధించి రూ.70వేల కోట్ల నుండి రూ.80వేల కోట్ల మేర నష్టం ఉంటుందని అంచనా.
ఎదుగుతున్న సమయంలో ఊహించని దెబ్బ
గ్లోబల్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం భారత ప్రభుత్వం నిషేధం విధించిన కారణంగా బైట్ డ్యాన్స్కు 6 బిలియన్ డాలర్ల నష్టం అంటే మన కరెన్సీలో రూ.45వేల కోట్ల మేర నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఓ నివేదిక ప్రకారం మే నెలలో 112 మిలియన్ల టిక్ టాక్ డౌన్ల్ లోడ్స్ జరిగాయి. అమెరికాలో డౌన్ లోడ్స్ కంటే దాదాపు రెండింతలుగా కొనసాగుతోంది. ఇప్పటికే చాలామంది యూజర్లు ఉన్నారు. హెలో గత కొద్ది నెలలుగా ఎదుగుతోంది. ఇలాంటి కీలక సమయంలో నిషేధం భారీ దెబ్బగా భావిస్తున్నారు.
చైనా ఇన్వెస్టర్లు, వ్యాపారులకు భారీ దెబ్బ
బైట్ డ్యాన్స్ ఇండియాలో కొన్నాళ్లుగా 1 బిలియన్ డాలర్ల వరకు ఇన్వెస్ట్ చేసింది. హెలో, టిక్టాక్తో పాటు ఇండియన్ మార్కెట్లో కీలకంగా ఎదిగిన షేరిట్, యూసీ బ్రౌజర్, ఎంఐ కమ్యూనిటీ, క్లబ్ ఫ్యాక్టరీ, వీచాట్, యూసీ న్యూస్ వంటి వాటిని బ్యాన్ చేసింది. చైనా పెట్టుబడిదారులు, వ్యాపారులను భారత ప్రభుత్వం నిర్ణయం దారుణంగా దెబ్బతీసిందని భావిస్తున్నారు. ఇన్వెస్టర్లు, వ్యాపారుల విశ్వాసాన్ని భారత్ దెబ్బతీసిందని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.
న్యాయ పోరాటం..
ఇదిలా ఉండగా 59 యాప్స్ నిషేధంపై చైనీస్ టెక్ దిగ్గజాలు ఇండియాకు వ్యతిరేకంగా రిట్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను వారు ప్రస్తావిస్తున్నారట. భారత ప్రభుత్వం నిర్ణయం నేపథ్యంలో డేటా లోకలైజేషన్, ప్రజల వ్యక్తిగత భద్రతపై కంపెనీలు ఆలోచన చేయనున్నాయని చెబుతున్నారు. అప్పటికీ ప్రభుత్వం నిషేధంపై పునఃపరిశీలన చేయకుంటే న్యాయపరంగా ముందుకు వెళ్లే ఆలోచన చేయనున్నాయట.