Telangana: తెలంగాణ అత్యుత్తమ పనితీరుతో దేశంలో దూసుకుపోతోంది: తమిళిసై
Telangana: సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని గవర్నర్ తమిళిసై ప్రసంగంలో వెల్లడించారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందని అన్నారు.
బీఆర్ఎస్ పాలనపై..
ప్రజల ఆశీర్వాదం, సీఎం సమర్థ పాలనతో తెలంగాణ 8 ఏళ్ల కాలంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని కొనియాడారు. వ్యవసాయం, సాగునీరు, విద్యుత్, ప్రజా సంక్షేమం, గ్రామీణ , పారిశ్రామికంగా ప్రభుత్వం సాధించిన అభివృద్ధని గవర్నర్ తన ప్రసంగం ద్వారా తెలిపారు. ప్రభుత్వ చర్యల ఫలితంగా 2014 -15లో రూ.1,24,000లుగా ఉన్న తలసరి ఆదాయం ఇప్పుడు రూ.3,17,115 కు చేరిందని స్పష్టం చేశారు.
సంక్షేమ రథాలు..
కాళేశ్వరాన్ని రికార్డు సమయంలో పూర్తి చేశామన్నారు. రైతుబంధు స్కీమ్ ప్రపంచవ్యాప్త ప్రశంసలు అందుకుందని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న కొత్త సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టినట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం నిర్మిస్తున్నామని గవర్నర్ తమిళిసై అన్నారు.
వ్యవసాయానికి చేయూత..
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వల్ల రాష్ట్రంలో సాగు భారీగా పెరిగిందన్నారు. ఉచిత, నాణ్యమైన విద్యుత్ ద్వారా రైతులకు ఎంతో లాభం చేకూరిందన్నారు. మిషన్ కాకతీయ పథకంతో చెరువులను పునరుద్ధరించారని పేర్కొన్నారు. రైతులకు పెట్టుబడి సాయంగా రైతు బంధు ఇస్తున్నారని తెలిపారు. రూ.5 లక్షల రైతు బీమా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ తమిళిసై పేర్కొన్నారు.
ఉద్యోగ నియామకాలు..
తెలంగాణలో ఉద్యోగాల భర్తీ కొనసాగుతోందన్నారు. రాష్ట్రం వచ్చిన నాటి నుంచి 2022 వరకు మెుత్తం 1,41,735 ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పర్మినెంట్ చేసే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. ఇదే క్రమంలో రాష్ట్రం ఐటీ కంపెనీలకు డెస్టినేషన్ గా మారిందని తెలిపారు. దీంతో అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్న విషయాన్ని ప్రస్థావించారు. దీంతో ఐటీ నియామకాలు 140 శాతం పెరగటమే కాక ఈ రంగంలో 3.31 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రం సాధించిందని ఆమె తన ప్రసంగం ద్వారా ప్రజలకు వెల్లడించారు.