హమ్మయ్య.. ఏప్రిల్ 24 వరకు బీఎస్-4 వాహనాల అమ్మకాలు
దేశంలో భారత్ స్టేజ్-4 వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్కు సంబంధించిన డెడ్లైన్ను సుప్రీంకోర్టు ఏప్రిల్ 24 వరకు పొడిగించింది. గతంలో ఈ వాహనాల విక్రయాలను మార్చి 31 లోగా పూర్తి చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన సంగతి తెలిసిందే.
అయితే కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న పరిస్థితులలో వాహనాల అమ్మకాలు జీరోకు పడిపోయాయి. గతంలో బుక్ చేసుకున్న కొనుగోలుదారులు ఆయా వాహనాలను డెలివరీ తీసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది.
ఈ నేపథ్యంలో బీఎస్-4 వాహనాల అమ్మకాలకు సంబంధించి గతంలో ఇచ్చిన గడువును మరికొంత కాలం పొడిగించాలంటూ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్(ఫాడా), ఆటోమొబైల్ ఉత్పత్తిదారుల సంఘం.. సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం కూడా సానుకూలంగా స్పందించింది.
ఈ అంశంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ దీపక్ గుప్తా కరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్డౌన్ కొనసాగుతున్నందున గడువును పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 14న లాక్డౌన్ పూర్తయిన తర్వాత మరో పది రోజుల వరకు అంటే.. ఏప్రిల్ 24 వరకు బీఎస్-4 వాహనాల అమ్మకం కొనసాగించవచ్చని స్పష్టం చేశారు.
అంతకుముందు పిటిషనర్ల తరపున న్యాయవాది మాట్లాడుతూ.. లాక్డౌన్ మూలంగా డీలర్లు తమ వద్ద ఉన్న వాహనాల స్టాకును అమ్మడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాహనాలు కొత్తగా కొనేవారుగానీ, గతంలో బుక్ చేసుకున్న వారు డెలివరీ తీసుకునేందుకుగాని షోరూమ్లకు రావడంలేదని కోర్టుకు విన్నవించారు.
బీఎస్-4 ప్రమాణాలతో కూడిన 15 వేల ప్యాసింజర్ కార్లు, 12 వేల వాణి జ్య వాహనాలు, ఏడు లక్షల ద్విచక్ర వాహనాలు ప్రస్తుతం పేరుకుపోయాయంటూ న్యాయమూర్తుల దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ.. దేశ పర్యావరణ పరిస్థితిని కూడా పిటిషన్దారులు అర్థం చేసుకోవాలని, కరోనా వైరస్ సంక్షోభాన్ని బీఎస్-4 ప్రమాణాలు కలిగిన వాహనాల అమ్మకాలకు ఉపయోగించుకోవాలని చూడకూడదని అభిప్రాయపడ్డారు.
ఇప్పటికే అమ్ముడుపోయిన వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఒకవేళ లాక్డౌన్ మూలంగా కాకపోయుంటే గనుక లాక్డౌన్ ఎత్తివేసిన తరువాత రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు.