స్టాక్ మార్కెట్స్ శుభారంభం: అంతలోనే రెడ్ మార్క్: పడుతూ లేస్తూ: ఆ షేర్లు భారీగా లాస్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారం తొలి రోజు లాభాలతో ఆరంభమైంది. స్టాక్స్ అన్నీ గ్రీన్జోన్లో ట్రేడింగ్ అవుతూ కనిపించాయి. 250 పాయింట్ల లాభంతో షేర్ మార్కెట్ ప్రారంభమైంది గానీ.. ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. కొద్దిసేపటికే డౌన్ఫాల్ రికార్డయింది. అన్ని ప్రధాన ఇండైసీస్కు చెందిన షేర్ల గ్రాఫ్ నేల చూపులు చూసింది. లోయర్ సర్క్యుట్లోకి చేరింది. ఇంట్రాడే ట్రేడింగ్ కాస్త మెరుగ్గా ఉండొచ్చనే అంచనాలు సైతం లేకపోలేదు.
ప్రారంభంలోనే 200 పాయింట్ల మేర లాభపడింది సెన్సెక్స్. 54,600 పాయింట్లను దాటుకుంది. తొలిగంటలో గరిష్ఠంగా 54,646.8 పాయింట్ల వరకు వెళ్లింది. అక్కడి నుంచి మళ్లీ క్షీణించడం మొదలు పెట్టింది. 54,542.66 పాయింట్లకు దిగజారింది. దీనితో దాదాపు అన్ని సెగ్మెంట్స్కు చెందిన షేర్ల ధరలు పడిపోయాయి. మైనస్లో ట్రేడ్ అవుతూ కనిపించాయి. రెడ్ జోన్లో జారిపోయాయి. రెండో గంట ఆరంభంలో కొద్దిసేపటికే మళ్లీ సెన్సెక్స్ పుంజుకొంది. 54,679.49 పాయింట్లకు చేరుకుంది. మొత్తంగా 355.65 పాయింట్ల మేర లాభపడింది.
నిఫ్టీ 50 కూడా పెద్దగా లాభపడలేదు. 50 పాయింట్లతో ఇవ్వాళ నిఫ్టీ 50 ట్రేడింగ్ ఆరంభమైంది. తొలిగంటలో 16,290 పాయింట్లతో ట్రేడింగ్ ఆరంభమైంది. అది ఎంతో సేపు నిలవలేదు. 16,226 పాయింట్లకు క్షీణించింది. ఆ తరువాత మళ్లీ ఒక్కసారిగా పైకెగిసింది నిఫ్టీ 50 గ్రాఫ్. రెండో గంటలో 16,344.65 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. సెన్సెక్స్, నిఫ్టీ.. మరింత దిగజారకపోవడం ఇన్వెస్టర్లను ఊపిరి పీల్చుకునేలా చేసింది. తొలి గంటలో ఫార్మాసూటికల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆటోమొబైల్ సెగ్మెంట్స్కు చెందిన షేర్లు కొంతమేర నష్టపోయాయి.
తొలి గంటలో టాటా స్టీల్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్స్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ షేర్లు భారీగా నష్టపోయాయి. ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, లార్సెన్ అండ్ టుబ్రో, మారుతి సుజుకి స్టాక్స్ తొలిగంటలో టాప్ గెయినర్స్గా రిజిస్టర్ అయ్యాయి. ఇంట్రాడే మొత్తంగా సెన్సెక్స్, నిఫ్టీ ట్రేడింగ్లో హెచ్చుతగ్గులు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.