Sovereign Gold Bond Scheme FY22: సోమవారం నుండి సావరీన్ గోల్డ్ బాండ్ స్కీం
కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(RBI) సావరీన్ గోల్డ్ బాండ్ స్కీం FY22 సిరీస్ IV పసిడి బాండ్స్ను జారీ చేయనుంది. ఈ నెల 12వ తేదీ నుండి (సోమవారం) అయిదు రోజుల పాటు ఈ బాండ్స్కు దరఖాస్తు చేసుకోవచ్చు. సావరీన్ గోల్డ్ బాండ్ స్కీం నాలుగో విడత జారీ చేయనున్న ఈ బాండ్ ధరను రూ.4,807గా నిర్ణయించింది. ఆన్లైన్లో కొనుగోలు చేస్తే, డిజిటల్ పద్ధతిలో ఇన్వెస్టర్లకు గ్రాముకు రూ.50 చొప్పున రాయితీ ఇస్తుంది. వారికి రూ.4757కే వస్తుంది.
వడ్డీ ఎంతంటే
భౌతిక బంగారం డిమాండును తగ్గించడం, దేశీయ పొదుపులో కొంత భాగాన్ని బంగారం కొనుగోలుకు ఉపయోగించే ఆర్థిక పొదుపుగా మార్చాలనే లక్ష్యంతో సావరీన్ గోల్డ్ బాండ్స్ పథకాన్ని నవంబర్ 2015వ తేదీన కేంద్రం ప్రారంభించింది. బ్యాంకు ద్వారా సబ్స్క్రైబ్ కావొచ్చు. పోస్టాఫీస్లలో కూడా అందుబాటులో ఉంటాయి.
స్టాక్ ఎక్స్చేంజెస్.. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, స్టాక్ హోల్డింగ్ కార్పోరేషన్ లేదా నేరుగా ఏజెంట్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. పసిడి బాండ్స్ పైన పెట్టుబడిదారులకు సంవత్సరానికి 2.50 శాతం వడ్డీ రెండు దభాలుగా చెల్లించబడుతుంది. ఇది ఇష్యూ జారీ చేసిన తేదీ నుండి అమల్లోకి వస్తుంది. ప్రతి ఆరు నెలలకు ఓసారి వడ్డీ చెల్లిస్తారు.
పన్ను వర్తింపు
సావరీన్ గోల్డ్ బాండ్లపై అందుకున్న వడ్డీకి పన్ను ఉంటుంది. వడ్డీ ఆదాయం వ్యక్తిగత ఆదాయంతో కలిపి వర్తించే పన్ను స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాలి. అయితే వడ్డీ ఆదాయంపై టీడీఎస్ లేదా సోర్స్ వద్ద పన్ను విధించరు. సావరీన్ గోల్డ్ కాలపరిమితి ఎనిమిదేళ్లు. మెచ్యూరిటీ వరకు ఉంచితే మూలధన లాభాలకు పన్ను వర్తించదు.
పెట్టుబడిదారులను భౌతిక బంగారు పెట్టుబడుల నుండి బాండ్స్ వైపు ప్రోత్సహించేందుకు అందించే ప్రత్యేక ఆదాయ పన్ను ప్రయోజనం. మూలధన లాభాల పన్ను నుంచి పన్ను మినహాయింపు గోల్డ్ ఈటీఎప్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో లేదు.
బాండ్ కాలపరిమితి
బాండ్స్ కాలపరిమితి ఎనిమిదేళ్లు కాగా ముందే నిష్క్రమించేందుకు రెండు పద్ధతులు ఉన్నాయి. ఎక్స్చేంజీలో లిస్టయిన బాండ్స్ను ఎక్స్చేంజీల ద్వారా విక్రయించాలి. లేదా జారీ చేసిన తేదీ నుండి ఐదో సంవత్సరం తర్వాత బాండ్స్ను ఉపసంహరించుకోవచ్చు. ఈ రెండు సందర్భాలలో మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది.
ఎక్స్చేంజీల ద్వారా విక్రయిస్తే కొనుగోలు చేసిన తేదీ నుండి మూడేళ్ల లోపు ఉండే స్వల్పకాలంగా పరిగణిస్తారు. మీ స్థూల మొత్తం ఆదాయానికి జోడించి వ్యక్తిగత ఆదాయ స్లాబ్ వద్ద ఆదాయపు పన్ను వర్తిస్తుంది. మూడేళ్లకు పైబడి ఉండే దీర్ఘకాలిక లాభాలు 20.8 శాతం పన్ను వర్తిస్తుంది.
కొనుగోలు పరిమితి
కనీసం ఒక గ్రాము నుండి 4 కిలోల వరకు ఎంతైనా కొనుగోలు చేయవచ్చు. ట్రస్టులు వంటివి అయితే 20 కిలోలు కొనుగోలు చేయవచ్చు. బాండ్ కొనుగోలు చేసిన సమయానికి ముందు ఇండియా బులియన్, జ్యువెల్లరీస్ అసోసియేషన్ లిమిటెడ్ ప్రచురించిన 999 స్వచ్ఛత బంగారం మూడు రోజుల ధరల సరాసరిని ఆధారంగా తీసుకొని బాండ్స్ విక్రయిస్తారు.
ఈ బాండ్స్ ద్వారా రుణ సదుపాయం పొందవచ్చు. బాండ్స్ కాలపరిమితి ముగిసిన తర్వాత ఎలాంటి మూలధన పన్ను చెల్లించకుండా పూర్తి డబ్బును పొందవచ్చు. ఒకవేళ పెట్టుబడిదారు మధ్యలో తన బాండును ఇతరులకు బదలీ చేస్తే దీర్ఘకాలిక మూలధన వడ్డీ చెల్లించాలి.