Sovereign Gold Bond: నేటి నుండే గోల్డ్ బాండ్ స్కీం, ఆ ధర కంటే రూ.300 తక్కువ
ఢిల్లీ: సావరీన్ గోల్డ్ బాండ్స్ 2020-21 సిరీస్ IX సబ్స్క్రిప్షన్ నేడు (డిసెంబర్ 28) ప్రారంభమైంది. ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఈ బాండ్స్ను జారీ చేస్తోంది. పెట్టుబడికి హామీ ఉంటుంది. గ్రాము బంగారం రూ.5,000గా నిర్ణయించారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొని, డిజిటల్ విధానంలో చెల్లింపులు జరిపితే గ్రాముకు రూ.50 తగ్గుతుంది. ఆన్లైన్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకునే వారికి గ్రాముకు రూ.4,950కి అందుబాటులోకి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 1, 2021.
ఆ యాప్స్తో చాలా జాగ్రత్త, ఉచ్చులో పడొద్దు: RBI హెచ్చరిక, పలువురి అరెస్ట్
సగటును లెక్కించి ధర
గోల్డ్ బాండ్స్ను గ్రాము బంగారం ధరతో మొదలు జారీ చేస్తారు. ఒక్కో బాండ్ ఒక్కో గ్రాము బంగారానికి సమానం. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెల్లర్స్ అసోసియేషన్ ప్రచురించిన ధర ఆధారంగా మదుపర్లు బాండ్స్లో పెట్టుబడి పెట్టాలి. 999 స్వచ్ఛత బంగారం ధర సబ్స్క్రిప్షన్కు ముందు వారం చివరి మూడు పని దినాలలో ఉన్న ధరకు సగటును లెక్కించి నిర్ణయిస్తారు. దరఖాస్తుదారు పాన్ నెంబర్ తప్పనిసరి. జారీ చేసిన బాండుపై పెట్టుబడిదారులకు ఏడాదికి 2.5 శాతం వడ్డీ అందిస్తుంది. ఆరు నెలలకు ఒకసారి వడ్డీని చెల్లిస్తారు.
పసిడి పథకాలకు ఈ ప్రయోజనం
పెట్టుబడి పెట్టిన రోజు నుండి 8 సంవత్సరాలు మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. మెచ్యూరిటీ సమయంలో ఇండియా బులియన్ అండ్ జ్యువెల్లర్స్ అసోసియేషన్ ప్రచురించిన 999 స్వచ్ఛత బంగారం, చివరి మూడు పని దినాలలో ఉన్న ధరకు సగటు లెక్కించి చెల్లింపులు జరుపుతారు. మెచ్యూరిటీ సమయం కంటే ముందు తీసుకోవాలంటే జారీ చేసిన రోజు నుండి 5 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత విత్ డ్రా చేసుకోవాలి. రుణ సదుపాయం ఉంటుంది. గోల్డ్ బాండ్స్ పైన వచ్చే వడ్డీ పైన పన్ను వర్తిస్తుంది. మెచ్యూరిటీ వరకు ఉంచితే మూలధన లాభాలపై పన్ను వర్తించదు. పన్ను ప్రయోజనం ప్రత్యేకించి పసిడి పథకాలకు మాత్రమే అందుబాటులో ఉంది.
నేటి ధర కంటే రూ.300 తక్కువకు
మెచ్యూరిటీకి ముందే విక్రయించాలనుకుంటే లిస్టయిన బాండ్స్ను ఎక్స్చేంజీల ద్వారా విక్రయించడం లేదా జారీ చేసిన తేదీ నుండి ఐదవ సంవత్సరం తర్వాత బాండ్స్ ఉపసంహరించుకోవచ్చు. అప్పుడు మూలధన లాభాలపై పన్ను వర్తిస్తుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ 10 సిరీస్ల గోల్డ్ బాండ్స్ విక్రయించింది. 6.13 టన్నుల పసిడి, రూ.2,316.37 కోట్ల బాండ్స్ విక్రయించింది. ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ధరలు ఈ రోజు రూ.50,300కు పైన ఉన్నాయి. గోల్డ్ బాండ్ రూ.50,000. పెద్దగా తేడా లేనప్పటికీ మంచి పెట్టుబడి పథకం.