దక్షిణాసియాలో భారత్ను ఒంటరి చేసేందుకు పాకిస్తాన్ కొత్త ప్లాన్.. దానికి పోయేకాలం దగ్గరపడిందంటున్న విశ్లేషకులు
దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో భారతదేశపు దీర్ఘకాల ఆధిపత్యాన్ని సవాలు చేయడానికి పాకిస్తాన్ మరోసారి సరికొత్త ఎత్తుగడకు తెరలేపింది. ప్రాంతీయ సమీకరణాలను మార్చే లక్ష్యంతో, ప్రస్తుతం నిర్వీర్యంగా ఉన్న సార్క్కు ప్రత్యామ్నాయంగా ఒక కొత్త బ్లాక్ అవసరమని పాకిస్తాన్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి ఇషాక్ దార్ చేసిన తాజా వ్యాఖ్యలు విస్తృత చర్చకు దారితీశాయి. చైనా-బంగ్లాదేశ్-పాకిస్తాన్ త్రైపాక్షిక యంత్రాంగాన్ని విస్తరించి, దీన్ని మరిన్ని దేశాలను కలుపుకుంటూ పెద్ద ప్రాంతీయ వేదికగా మార్చాలని ఇస్లామాబాద్ కోరుకుంటోంది.
ఈ ప్రతిపాదన ద్వారా దక్షిణాసియాలో కొత్త శక్తి సమీకరణం సృష్టించాలన్న ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, భారతదేశాన్ని మినహాయించిన సమూహంలో ఏ దేశం చేరదనే అభిప్రాయమే నిపుణులలో బలంగా వినిపిస్తోంది. సార్క్ 1985లో స్థాపించబడినప్పటి నుంచి దక్షిణాసియా దేశాలను ఒక వేదికపైకి తెచ్చిన ప్రధాన కూటమి. కానీ ఇండియా-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన కొద్దీ ఈ సంస్థ చురుకుదనం కోల్పోయింది.

2014లో చివరి శిఖరాగ్ర సమావేశం జరిగిన తర్వాత సార్క్ దాదాపుగా నిలిచిపోయింది. ఉరి దాడి తర్వాత 2016లో ఇస్లామాబాద్లో జరగాల్సిన సమావేశాన్ని భారత్ బహిష్కరించడంతో సార్క్ సంస్థ పూర్తిగా మరుగన పడిపోయింది. దౌత్యరంగంలో పాకిస్తాన్కు దీనివల్ల గట్టి దెబ్బ తగిలింది. ఇదే సమయంలో భారత్ తన దృష్టిని BIMSTEC వైపు మళ్లించి, పాకిస్తాన్ని పూర్తిగా పక్కన పెట్టిన ప్రాంతీయ వేదికను బలపరచడం ప్రారంభించడంతో ఇస్లామాబాద్కు కొత్త ఒత్తిడి వచ్చింది.
ఈ నేపథ్యంతోనే పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి ఇషాక్ దార్ ... దక్షిణాసియా ఇకపై జీరో-సమ్ రాజకీయాలు, విభేదాల పునరావృతం లో చిక్కుకోరాదంటూ కొత్త బ్లాక్ అవసరాన్ని ప్రస్తావించారు. దక్షిణాసియాలో సహకారం ఎంతో ముఖ్యమైన విషయం. సార్క్ దేశాల జనాభా రెండు బిలియన్లకు పైగా ఉండటం వలన ప్రపంచంలో అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతమిది.
కానీ పరస్పర వాణిజ్యం మాత్రం ప్రపంచంలో అత్యల్పస్థాయిలో ఉంది. మొత్తం వాణిజ్యంలో కేవలం 5 శాతం మాత్రమే ఒకదానితో ఒకటి కలిసి చేస్తాయి. ప్రపంచ బ్యాంక్ అంచనాల ప్రకారం.. అడ్డంకులను తగ్గిస్తే ఈ మొత్తం మూడు రెట్లు పెరిగే అవకాశం ఉంది. అయితే రాజకీయ వైరం, కనెక్టివిటీ లోపం, దౌత్య ఉద్రిక్తతలు సహకారానికి పెద్ద అడ్డంకిగా కొనసాగుతున్నాయి.
ఇలాంటి సమయంలో పాకిస్తాన్ ప్రతిపాదించిన కొత్త బ్లాక్ ఆలోచన.. ఆచరణలో సాధ్యపడే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ఇందుకు ప్రధాన కారణం భారతదేశం యొక్క తిరుగులేని ప్రభావం. భారత జనాభా, ఆర్థిక వ్యవస్థ, సైనిక శక్తి, సంక్షోభ సమయంలో ఇచ్చే సాయం వంటి అంశాలు దక్షిణాసియాలో చిన్న దేశాలను భారత్ వైపు నిలబెట్టాయి. నేపాల్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులు వంటి దేశాలు తమ ఆర్థిక కార్యకలాపాల కోసం భారతదేశంపై ఆధారపడటం, కోవిడ్ మహమ్మారి సమయంలో భారత్ చేసిన వ్యాక్సిన్ సరఫరా, సహాయక చర్యలు.. ఇవన్నీ న్యూఢిల్లీని ప్రాంతీయ నాయకుడిగా స్థిరపర్చాయి.
ఈ నేపథ్యంలో భారతదేశాన్ని పక్కన పెట్టిన ఒక బ్లాక్లో చేరడం ఏ చిన్న దేశం అయినా రిస్క్గా చూస్తోంది. చైనా ప్రభావం పెరుగుతున్నప్పటికీ, పూర్తిగా బీజింగ్ వైపు నడవడం తమకు ప్రమాదమని వారు భావిస్తున్నారు. రాజకీయ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సార్క్ కూడా భారత్ లేకపోవడంతోనే స్థిరత్వం కోల్పోయింది. ఇదే పరిస్థితి పాకిస్తాన్ ప్రతిపాదించే ఏ కొత్త ప్రాంతీయ బ్లాక్కూ అయినా ఎదురవుతుందని వారు స్పష్టం చేస్తున్నారు. దక్షిణాసియాలో భారతదేశం ముఖ్య పాత్ర పోషించినప్పుడే అది గట్టిగా నిలుస్తుంది. అందుకే పాకిస్తాన్ ప్రతిపాదన ఒక రాజకీయ సందేశంగా నిలిచినా, వాస్తవంగా పనిచేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే ఈ ఏడాది ఆరంభంలో పాకిస్థాన్.. చైనా, బంగ్లాదేశ్ కలిసి ఒక త్రైపాక్షిక వేదికను ఏర్పాటు చేశాయి. చైనాలోని కున్మింగ్లో జూన్లో తొలి సమావేశం కూడా జరిపారు. ఇప్పుడు దీనిని మరింత విస్తరించాలని పాక్ భావిస్తోంది. అయితే భారత్ లేకుండా ఇది అాసాధ్యమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications


