54,500 పాయింట్లకు సమీపంలో సెన్సెక్స్, 16,300 చేరుకున్న నిఫ్టీ
స్టాక్ మార్కెట్లు వరుసగా లాభాల్లో ముగిశాయి. ఈ వారం అంతా సూచీలు దుమ్ము రేపుతున్నాయి. సోమవారం లాభాల్లో ముగిసిన సూచీలు, మంగళ, బుధవారాలు భారీగా లాభపడ్డాయి. నేడు మళ్లీ లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ మూడు రోజుల్లో 2000 పాయింట్లు లాభపడింది. నేడు సూచీలు ప్రారంభంలో కాస్త ఒడిదుడుకుల్లో లోనైనప్పటికీ మధ్యాహ్నం తర్వాత భారీగా పుంజుకున్నాయి. దీంతో నేడు సెన్సెక్స్ 123 పాయింట్లు లాభపడింది. ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు డీలాపడినప్పటికీ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, HDFC బ్యాంకు, ఎయిర్టెల్, టాటా స్టీల్ వంటి స్టాక్స్ సూచీల పరుగుకు కారణమయ్యాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 74.17గా ఉంది.
సెన్సెక్స్ 54,576.64 పాయింట్ల వద్ద ప్రారంభమై, 54,717.24 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 54,230.89 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 16,288.95 పాయింట్ల వద్ద ప్రారంభమై, 16,349.45 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,210.30 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 123.07 (0.23%) పాయింట్లు లాభపడి 54,492.84 పాయింట్ల వద్ద, నిఫ్టీ 35.80 (0.22%) పాయింట్లు ఎగిసి 16,294.60 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ నేడు 54,700 పాయింట్లు క్రాస్ చేసింది. తద్వారా 55,000 పాయింట్ల దిశగా పరుగులు పెడుతోంది. నిఫ్టీ 16,350 పాయింట్ల దరిదాపుకు చేరుకొని, చివరకు 16,295 పాయింట్ల వద్ద ముగిసింది.
ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ మధ్యాహ్నం వరకు ఒడుదొడుకులు ఎదుర్కొంది. నిఫ్టీలో భారతీ ఎయిర్టెల్, ఐషర్ మోటార్స్, ఐటీసీ, టెక్ మహీంద్రా, టాటా స్టీల్ ప్రధానంగా లాభాల్లో ముగిశాయి. ఎస్బీఐ, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ నష్టాలు నమోదు చేశాయి. ఐటీ, మెటల్స్, మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఐటీ, మెటల్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. ఎయిర్టెల్ స్టాక్ నాలుగు శాతానికి పైగా లాభపడింది.