మున్ముందు మంచికాలం: లాభాల్లో స్టాక్స్: ఇన్వెస్టర్లు ఫుల్ ఖుష్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ ఇవ్వాళ లాభాలతో ఆరంభమైంది. స్టాక్స్ అన్నీ గ్రీన్జోన్లో ట్రేడింగ్ అవుతూ కనిపించాయి. సాయంత్రానికి సెన్సెక్స్, నిఫ్టీ మరింత లాభపడే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. కొద్దిరోజులుగా స్టాక్ మార్కెట్లో నెలకొన్న తిరోగమనాన్ని అధిగమించేలా ఉందివ్వాళ్టి మార్కెట్ పరిస్థితి. ఈ ట్రెండ్కు అనుగుణంగానే మార్కెట్ ట్రేడ్ అవుతోంది. ఈ వారం తొలిరోజే స్టాక్ మార్కెట్ లాభాలతో ఆరంభం కావడం వల్ల మున్ముందు మరింత మంచికాలం ఉంటుందని ఆశిస్తున్నారు.
ప్రారంభంలోనే 500 పాయింట్ల మేర లాభపడింది సెన్సెక్స్. కొద్దిసేపటికే ఇది 700 పాయింట్లకు చేరుకుంది. ఇన్వెస్టర్లు స్టాక్స్ కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వడంతో సెన్సెక్స్ మరింత పెరుగుతూ వెళ్లింది. కీలకమైన సెగ్మెంట్స్కు సంబంధించిన షేర్లన్నీ గ్రీన్జోన్లో ట్రేడింగ్ అయ్యాయి. ఇన్వెస్ట్మెంట్స్ వైపు దృష్టి పెట్టడం వల్ల ఇంట్రాడే మొత్తం పాజిటివ్ గానే ఉంటుందనే సంకేతాలు స్టాక్ మార్కెట్స్ నుంచి వెలువడుతున్నాయి.
లాభాలతో ప్రారంభంలో సెన్సెక్స్ 53,000 మార్క్ను తొలి గంటలోనే దాటేసింది. నిఫ్టీ సైతం లాభాల్లో ట్రేడ్ అయింది. 15,900 పాయింట్లు దాటింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆటోమొబైల్ సెగ్మెంట్స్కు చెందిన షేర్లు కొంతమేర లాభపడ్డాయి. అంబుజా సిమెంట్స్, ఏసీసీ టాప్ గెయినర్గా నిలిచాయి. అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన షేర్లు కూడా అప్పర్ సర్క్యుట్లో ట్రేడ్ అయ్యాయి. స్విట్జర్లాండ్కు చెందిన హోల్సిమ్ గ్రూప్స్తో అగ్రిమెంట్ కుదుర్చుకోవడం- అదాని గ్రూప్స్ స్టాక్స్ మీద సానుకూల ప్రభావాన్ని చూపింది.
ఈ కంపెనీకి చెందిన షేర్ల ధరలు మూడుశాతం మేర పెరిగాయి. టాటా స్టీల్, టైటాన్ కంపెనీ, మారుతి సుజుకి, బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ, మహీంద్ర అండ్ మహీంద్ర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు భారీగా లాభపడ్డాయి. తొలి గంటలో అల్ట్రాటెక్ సిమెంట్స్, డాక్టర్ రెడ్డీస్, నెస్ట్లె ఇండియా, భారతీ ఎయిర్టెల్ షేర్ల ధరలు కొంతవరకు తగ్గాయి. ఎయిర్ టెల్, ఎల్ అండ్ టీ వంటి షేర్లు శుక్రవారం కూడా తిరోగమనంలోనే కనిపించిన విషయం తెలిసిందే.