58% కంపెనీలపై సెకండ్ వేవ్ ప్రభావం, ఇలా చేస్తే ఎకానమీ దూకుడు
భారత్లోని పలు రాష్ట్రాలు లాక్డౌన్ ఆంక్షలను క్రమంగా సడలిస్తున్న నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నట్లు ఫిక్కీ-ధ్రువ్ అడ్వయిజర్స్ సర్వే పేర్కొంది. వచ్చే ఆరు నెలల నుండి 12 నెలల కాలంలో మెరుగైన పనితీరును కనబరుస్తామనే ఆశాభావం భారత కంపెనీల్లో నెలకొందని తెలిపింది. దేశవ్యాప్తంగా దాదాపు 211 కంపెనీల నుండి అభిప్రాయ సేకరణ జరిగింది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం 58 శాతం కంపెనీలపై పడిందని వెల్లడించింది.
కరోనా సెకండ్ వేవ్ భయాలతో కస్టమర్ సెంటిమెంట్ దెబ్బతినడంతో కంపెనీల అమ్మకాలు తగ్గినట్లు పేర్కొంది. ఈసారి గ్రామీణ ప్రాంతాల్లో కూడా డిమాండ్ క్షీణత కనిపించిందని, ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడుతున్నప్పటికీ, కరోనా మలివిడతలకు సిద్ధంగా ఉండాలని పేర్కొంది. దాదాపు రెండు నెలల పాటు స్తంభించిన ఆర్థిక కార్యకలాపాలు తిరిగి పునరుద్ధరణ దిశగా నడుస్తున్నట్లు తెలిపింది.
కరోనాను మున్ముందు ఎదుర్కోవడానికి ఐదు చర్యలను ఫిక్కీ సూచించింది. చిన్న నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యపరమైన మౌలిక వసతులకు కేటాయింపుల పెంపు, అత్యవసర ఔషధాల నిల్వలు తగినంతగా ఉండేలా చూసుకోవడం, తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కొత్త మౌలిక వసతులను కొనసాగించడం, రోగ నిర్థారణ కేంద్రాలను పెంచడం, ప్రభుత్వ నిధులతో వ్యాక్సీన్ తయారీ నిమిత్తం ఓ జాతీయ కేంద్రాన్ని నెలకొల్పాలని పేర్కొంది. ఎయిర్ పోర్ట్స్, రైల్వే-బస్సు స్టేషన్స్, స్కూల్స్, పంచాయతీ కార్యాలయాల వద్ద వ్యాక్సీన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించింది.