అన్ని కాల వ్యవధుల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించిన ఎస్బీఐ, ఎంతంటే?
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఫిక్స్డ్ డిపాజిట్ల(ఎఫ్డీ)పై మరోసారి వడ్డీ రేట్లను తగ్గించింది. అన్ని కాల వ్యవధుల ఫిక్స్డ్ డిపాజిట్లపై 40 బేసిస్ పాయింట్ల మేర కోత విధించింది. తగ్గించిన వడ్డీ రేట్లను మే 27 అంటే నేటి నుంచి అమల్లోకి తీసుసొస్తున్నట్లు ఎస్బీఐ తన అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది.
సుమారు నెల రోజుల వ్యవధిలోనే వడ్డీ రేట్లు తగ్గించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ప్రస్తుతం సవరించిన వడ్డీ రేట్ల ప్రకారం.. ఇకపై 7 నుంచి 45 రోజుల కాల వ్యవధి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై 2.9 శాతం వడ్డీ మాత్రమే లభించనుంది.
46 నుంచి 179 రోజులకు 3.9శాతం, 180-ఏడాది వరకు 4.4 శాతం, ఒక ఏడాది నుంచి 3 ఏళ్ల వరకు 5.1 శాతం, మూడేళ్ల నుంచి 5 ఏళ్ల వరకు 5.3 శాతం, ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు 5.4శాతం వడ్డీ రేట్లను అందించనున్నట్లు ఎస్బీఐ పేర్కొంది.
సీనియర్ సిటిజిన్లకు సవరించిన వడ్డీ రేట్లకు 50 బేసిస్ పాయింట్ల అదనంగా వడ్డీ జమ చేయనున్నట్లు తెలిపింది. అంటే 3 నుంచి 5 ఏళ్ళ వరకు డిపాజిట్లపై 5.3 శాతం ఉండగా, ఇప్పుడు సీనియర్ సిటిజన్లకు 5.8 శాతం చెల్లించనున్నారు. ఇక ఐదు నుంచి పదేళ్ల వరకు డిపాజిట్లపై 6.2 శాతం చెల్లించనున్నారు. వచ్చే సెప్టెంబర్ 30 వరకు ఈ వడ్డీ రేట్లు అమలులో ఉండే అవకాశం ఉంది.