శబరిమలలో రూ. వేల కోట్ల బంగారం మాయం.. ED దర్యాప్తులో బయటపడుతున్న సంచలన నిజాలు
కేరళలోని శబరిమల ఆలయానికి చెందిన బంగారం, ఇతర ఆలయ ఆస్తుల దొంగతనానికి సంబంధించి జరుగుతున్న మనీలాండరింగ్ దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మంగళవారం కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని మొత్తం 21 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. ఈ దర్యాప్తు కేవలం బంగారం దొంగతనానికే పరిమితం కాకుండా, శబరిమల ఆలయానికి చెందిన ఇతర విలువైన ఆస్తుల దుర్వినియోగం, ఆర్థిక మోసాలు,వ్యవస్థాపరంగా అవకతవకల వరకు విస్తరించినట్లు అధికారులు తెలిపారు.
ED అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. Sabarimala ఆలయంలో సంవత్సరాలుగా క్రమబద్ధంగా, వ్యవస్థీకృతంగా బంగారం దొంగతనం జరిగే అవకాశముంది. అంతేకాకుండా ఆలయ ప్రసాదాలు, పూజా సామగ్రి, ఆచారాలకు సంబంధించిన వస్తువుల విషయంలో కూడా అక్రమాలు జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) పరిధిలో పరిశీలిస్తున్నారు.

ఈ కేసు కేరళ క్రైమ్ బ్రాంచ్ నమోదు చేసిన వరుస ఎఫ్ఐఆర్ల ఆధారంగా బయటకు వచ్చింది. దర్యాప్తులో చాలా కాలంగా వివిధ స్థాయిలలో కుట్రలు, ప్రణాళికాబద్ధమైన అక్రమ లావాదేవీలు జరిగినట్లు ED గుర్తించింది. ఇందులో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు, మధ్యవర్తులు, ఆభరణాల వ్యాపారులు కలిసి పనిచేసిన లోతైన నేరపూరిత కుట్ర ఉందని ED స్పష్టం చేసింది. కోర్టు నుంచి అవసరమైన అనుమతులు పొందిన అనంతరం జనవరి 9న బంగారం దొంగతనం, స్మగ్లింగ్కు సంబంధించి ED అధికారికంగా మనీలాండరింగ్ కేసును నమోదు చేసింది. ఆ తర్వాత జరిగిన దర్యాప్తులో అనేక షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ED వెల్లడించిన వివరాల ప్రకారం..2019 నుంచి 2025 మధ్యకాలంలో శబరిమల ఆలయంలోని బంగారు పూతతో కూడిన పవిత్ర కళాఖండాలను ఉద్దేశపూర్వకంగా రాగి పలకలు (Copper Plates)గా అధికారిక రికార్డుల్లో తప్పుగా నమోదు చేశారు. ఈ విధంగా వాటిని ఆలయ ప్రాంగణం నుంచి చట్టవిరుద్ధంగా బయటకు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం చెన్నై, కర్ణాటకలోని ప్రైవేట్ సౌకర్యాల్లో రసాయన ప్రక్రియల ద్వారా బంగారాన్ని వెలికితీశారని, ఆ బంగారంతో వచ్చిన ఆదాయాన్ని దాచడం, బదిలీ చేయడానికి వినియోగించారని ED అనుమానిస్తోంది.
ఈ మనీలాండరింగ్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని గుర్తించడం, అసలు లబ్ధిదారులను తెలుసుకోవడం, కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకోవడం, అలాగే మనీలాండరింగ్ యొక్క పూర్తి స్థాయిని నిర్ధారించడానికే ఈ సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. కోర్టుల నుంచి అనుమతి పొందిన తరువాతే సంబంధిత పత్రాలు, పోలీస్ రికార్డులను సేకరించామని ED స్పష్టం చేసింది.
ఈ బంగారం దొంగతనం మొదటిసారి 2019లో వెలుగులోకి వచ్చినప్పటికీ.. ఈ అక్రమాలు రెండు దశాబ్దాలకు పైగా కొనసాగి ఉండవచ్చని వర్గాలు చెబుతున్నాయి. 2019లో ఆలయంలోని విగ్రహాలను మరమ్మతుల కోసం బయటకు తీసుకెళ్లగా.. అప్పట్లో వాటి బరువు 42.8 కిలోలు ఉండేది. అయితే మరమ్మతుల అనంతరం తిరిగి అందజేసినప్పుడు బరువు 38.2 కిలోలకు తగ్గిపోయినట్లు గుర్తించారు. అంటే దాదాపు 4.5 కిలోల బంగారం మాయం అయినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు.
విగ్రహాలను చెన్నైకి చెందిన ఒక ప్రైవేట్ సంస్థకు మరమ్మతులు, బంగారు పూత పూయడానికి అప్పగించారని, తిరిగి ఇచ్చే సమయంలో బరువు తగ్గడాన్ని నిందితులు అరిగిపోవడం అంటూ సమర్థించారని, ఆ తర్వాత ఈ వ్యవహారాన్ని పక్కన పెట్టినట్లు దర్యాప్తులో వెల్లడైంది.


Click it and Unblock the Notifications


