RTGS అలర్ట్: ఏప్రిల్ 18న 14 గంటల పాటు సేవలకు అంతరాయం
ఆర్టీజీఎస్ అలర్ట్! మూడో ఆదివారం (ఏప్రిల్ 18) రోజున RTGS సేవల్లో అంతరాయం ఏర్పడుతుంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వెల్లడించింది. అయితే NEFT సేవల్లో మాత్రం ఎలాంటి అంతరాయం ఉండదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర బ్యాంకు ప్రెస్ నోట్ విడుదల చేసింది.
'ఆదివారం, ఏప్రిల్ 18, 2021 నాడు సేవలు గం.00.00 నుండి గం.14.00 వరకు అందుబాటులో ఉండవు' అని ప్రెస్ నోట్లో పేర్కొంది. అంటే ఏప్రిల్ 17వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 12 గంటల నుండి (అంటే 18వ తేదీ) మధ్యాహ్నం గం.2 వరకు సేవలు అందుబాటులో ఉండవు. ఈ సమయంలో ఆర్టీజీఎస్ మెంబర్స్కు అప్ డేట్ ఎప్పటికి అప్పుడు తెలుస్తుంది.
ఇక, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్సుఫర్ (NEFT) సిస్టం పని చేస్తుందని తెలిపింది. ఆర్టీజీఎస్ సేవల సామర్థ్యాన్ని, డిజాస్టర్ రికవరీ టైంను మెరుగుపరిచేందుకు ఈ వ్యవస్థను సాంకేతికంగా నవీకరిస్తున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 17వ తేదీన వ్యాపార కార్యకలాపాలు ముగిసిన అనంతరం ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొంది. దీంతో శనివారం అర్ధరాత్రి నుండి ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఆర్టీజీఎస్ సేవలు అందుబాటులో ఉండబోవని తెలిపింది.