చైనా కంపెనీకి కేంద్రం ఊరట, ఇదీ విషయం.. స్వదేశీ జాగరణ్ మంచ్ ట్విస్ట్
5G నెట్ వర్క్ పరిశీలనకు అందరికీ అవకాశముంటుందని, చైనాకు చెందిన హువావేతో పాటు అన్ని సంస్థలకు ట్రయల్స్ కోసం 5G స్పెక్ట్రంను ఇస్తామని కేంద్ర టెలికం శాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ సోమవారం చెప్పారు. దీనిపై స్వదేశీ జాగరణ్ మంచ్ (SJM) ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అనుబంధ సంస్థ SJM. 5G స్పెక్ట్రం కేటాయింపుల విషయంలో చైనా కంపెనీ హువావేను పరిగణలోకి తీసుకోవద్దని, భారతదేశ భద్రతను, ప్రయోజనాలను కాపాడాలని ప్రధాని మోడీకి SJM లేఖ రాసింది.

చైనా డివైజ్ల నుంచి సమాచారం లీక్
చైనా ఎగుమతి చేసే పలు డివైజ్లు భారత కస్టమర్ల నుంచి సున్నితమైన సమాచారాన్ని ఇతర వ్యక్తులకు చేరవేస్తున్నాయనే ఆధారాలు ఉన్నాయని SJM ఆ లేఖలో పేర్కొంది. హువావే వల్ల పలు రకాల ప్రమాదాలు పొంచి ఉన్నట్లు తమ సంస్థ తరఫున టెలికం విభాగానికి తెలిపిందని, కానీ తమ అభ్యర్థనను టెలికం విభాగం పట్టించుకోలేదని SJM కో కన్వీనర్ అశ్వనీ మహాజన్ అన్నారు. అందుకే తాము ప్రధాని మోడీకి లేఖ రాసినట్లు చెప్పారు.

దేశ భద్రత విషయంలో రాజీ వద్దు..
ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరామని అశ్వనీ మహాజన్ అన్నారు. ప్రస్తుతం డిజిటల్ యుగంలో దేశ భద్రతకు సంబంధించి రాజీపడవద్దని, 5G ఎంతో ముఖ్యమైన టెక్నాలజీ అని, భారత్కు ఇది ఎంతో అవసరమన్నారు. ఇందుకు దేశీయ సంస్థలను తోడ్పాడును అందించాల్సిందిగా కోరుతున్నామని చెప్పారు. ఇప్పటికే పలు దేశాలు హువావేపై నిషేధం విధించాయని చెప్పారు. తమ టెక్నాలజీ, మిలిటరీకి సంబంధించిన రహస్యాలను సైబర్ హ్యాకింగ్ ద్వారా చైనా కంపెనీలు దొంగిలించాయి సదరు దేశాలు అనుమానిస్తున్నాయన్నారు.

5G... అందరికీ అవకాశం
కాగా, 5G నెట్ వర్క్ పరీక్షల కోసం హువావే సహా ఆపరేటర్లందరికీ అనుమతులు ఇవ్వాలని కేంద్రం ఇటీవల నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్ సోమవారం మాట్లాడుతూ.. 5జీ నెట్ వర్క్ పరికరాలు అందించే ఏ సంస్థపై నిషేధం విధించే ఉద్దేశ్యం లేదన్నారు. ఏ సంస్థను కూడా 5జీ ట్రయల్స్కు దూరంగా పెట్టేది లేదని చెప్పారు. కానీ SJM దీనిని వ్యతిరేకిస్తోంది.

హువావేకు ఉపశమనం
5G ట్రయల్స్కు సంబంధించి టెలికం శాఖ తుది ప్రకటన చేస్తుందని రెండు రోజుల క్రితం రవిశంకర ప్రసాద్ తెలిపారు. 5G అనేది భవిష్యత్తు, వేగమని, తాము 5జీలో కొత్తదనాన్ని ప్రోత్సహిస్తామన్నారు. వచ్చే ఏడాది మార్చి ఆఖరులోగా 5G ట్రయల్స్ జరగవచ్చునని తెలుస్తోంది. ఇందులో పాల్గొనేందుకు నోకియా, ఎరిక్సన్, హువావే, జెడ్టీఈ, శాంసంగ్ తదితర అన్ని మొబైల్ తయారీదారులు, టెలికం ఆపరేటర్లు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్లో అన్ని విదేశీ పెట్టుబడులను ఒకేలా, పారదర్శకంగా భారత ప్రభుత్వం చూస్తుందన్న ఆశాభావాన్ని హువావే వ్యక్తం చేసింది. ఈ క్రమంలో హువావేకి అనుకూల సంకేతాలు రావడం ఆ సంస్థకు ఉపశమనం.


Click it and Unblock the Notifications