రిజర్వ్బ్యాంక్ డివిడెండ్ రూ.30 వేల కోట్లకు పైగా
ముంబై: భారతీయ రిజర్వు బ్యాంక్- కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ను ప్రకటించింది. ఈ మేరకు ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఓ తీర్మానం చేశారు. డివిడెండ్పై రూపొందించిన ప్రతిపదనలపై ఆమోద ముద్ర వేశారు. గత ఆర్థిక సంవత్సరం అంటే 2021-22కు సంబంధించిన డివిడెండ్ మొత్తం ఇది. ఈ డివిడెండ్ విలువ 30,307 కోట్ల రూపాయలు. దీనితో పాటు కంటింజెన్సీ ఆఫ్ రిస్క్ బఫర్ను 5.50 శాతంగా నిర్ధారించింది ఆర్బీఐ.
గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన డివిడెండ్ చెల్లింపులపై రిజర్వు బ్యాంక్ ఇవ్వాళ సమావేశమైంది. 596వ భేటీ ఇది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ దీనికి నాయకత్వాన్ని వహించారు. పలు అంశాలపై చర్చించారు. ఏటీఎంల నుంచి కార్డ్ లెస్ క్యాష్ విత్డ్రావల్స్ సహా కీలక అంశాలపై చర్చించారు. దేశ ఆర్థిక స్థితిగతులు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల మారుతున్న ఆర్థిక పరిణామాలపైనా అభిప్రాయాలను పంచుకున్నారు.
అనంతరం డివిడెండ్ మొత్తాన్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వెల్లడించారు. ఈ మొత్తాన్ని 30,307 కోట్ల రూపాయలుగా నిర్ధారించారు. అంతకుముందు నాటి ఆర్థిక సంవత్సరం అంటే- 2020 జులై నుంచి గత సంవత్సరం మార్చి 31వ తేదీ కాలానికి రిజర్వ్ బ్యాంక్ 99,122 కోట్ల రూపాయల డివిడెండ్ను చెల్లించిన విషయం తెలిసిందే. ఈ సంవత్సరం ఈ మొత్తం మూడింతలు తగ్గినట్టయింది. 30,307గా రిజర్వ్ బ్యాంక్ నిర్ధారించింది. ఈ మొత్తాన్ని సర్ప్లస్ (మిగులు)గా చూపించింది.
2020 నాటితో పోల్చుకుంటే ఆర్బీఐ తాజాగా ప్రకటించిన డివిడెండ్ మొత్తం చాలా తక్కువని, దీనికి అనేక కారణాలుఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. కేంద్ర ప్రభుత్వం వేసిన అంచనాల కంటే ఈ మొత్తం చాలా తక్కువ. ఇదివరకు 73,948 కోట్ల రూపాయల మేర డివిడెండ్ అందొచ్చని అంచనా వేసింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ. ఆ అంచనాలను ఆర్బీఐ అందుకోలేకపోయింది. గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 30,307 కోట్ల రూపాయలను డివిడెండ్గా చూపించింది.