క్యూ4లో నష్టాలు నమోదు చేసిన పీవీఆర్: ఉద్యోగాల కోతలు, నో ఇంక్రిమెంట్స్
న్యూఢిల్లీ: 2019 క్యూ 4 మార్చిలో నికర లాభం రూ .46.75 కోట్లతో పోల్చితే, క్యూ 4 మార్చి 2020లో 74.61 కోట్ల రూపాయల నికర నష్టాన్ని నమోదు చేసింది పీవీఆర్. 1.51% పడిపోయి రూ .1,142 కు చేరుకుంది. సినిమా చైన్ కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఈ మేరకు నష్టాలు చవిచూసింది.
ఈ త్రైమాసిక చివరి నెలలో కోవిడ్-19 వ్యాప్తి చెందడంతో 2019 క్యూ 4 మార్చిలో కన్సాలిడేటెడ్ నికర అమ్మకాలు 23% తగ్గి 645.13 కోట్లకు చేరుకున్నాయి. క్యూ 4 మార్చి 2019లో 74.21 కోట్ల రూపాయల ప్రీ-టాక్స్ లాభంతో పోలిస్తే, 2020 మార్చి 4 లో కన్సాలిడేటెడ్ ప్రీ-టాక్స్ నష్టం రూ .70.19 కోట్లుగా ఉంది. ప్రస్తుత పన్ను రిబేటు 2020 క్యూ 4 లో రూ .31.80 కోట్లుగా ఉండగా, పన్ను వ్యయం మార్చి 2019లో క్యూ 4లో రూ. 18.67 కోట్లుగా ఉంది.
వేతనాలు, ఉద్యోగాల కోతలు పెట్టిన పీవీఆర్
లాక్ డౌన్ ప్రభావంతో నష్టాలు నమోదు చేసుకున్న ప్రముఖ మల్టీఫెక్స్ల నిర్వహణ సంస్థ పీవీఆర్ వ్యయ నియంత్రణ చర్యలకు ఉపక్రమించింది. వేతనాలు, ఉద్యోగాల కోతతోపాటు ఇంక్రిమెంట్లనూ వాయిదా వేసినట్లు ప్రకటించింది. దేశ వ్యాప్తంగా సినిమాల నిలిపివేత కారణంగా సినిమా ప్రదర్శన, దానికి సంబంధించిన వ్యాపారాల నుంచి తమకు ఎటువంటి ఆదాయం రాలేదని కంపెనీ తెలిపింది. దీంతో లాభదాయకత, నిధుల లభ్యతపై గణనీయ ప్రభావం పడిందని పేర్కొంది.
తిరిగి పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేవరకు ఈ పరిస్థితి కొనసాగొచ్చని తెలిపింది. అందుకే వ్యయ నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ సమయంలో లేఆఫ్ల ద్వారా సిబ్బంది సంఖ్యను తగ్గించుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. వివిధ స్థాయిల్లోని ఉద్యోగుల వేతనాల్లోనూ కోత విధించినట్లు పేర్కొంది. మరోవైపు రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 300 కోట్లు సమీకరించే ప్రతిపాదనకు పీవీఆర్ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది.