కస్టమర్లపై బ్యాంకుల మినిమం బ్యాలెన్స్ ఫైన్ వసూళ్లు రూ.2 వేలకోట్లు
న్యూఢిల్లీ: బ్యాంకు ఖాతాల్లో మినిమం నెలసరి బ్యాలెన్స్ లేని కస్టమర్ల నుంచి అన్ని బ్యాంకులు కూడా జరిమానా రూపంలో కొంత మొత్తం వసూలు చేస్తాయి. ఇలాంటి ఛార్జీల రూపంలో ప్రభుత్వరంగ బ్యాంకులు గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా దాదాపు రూ.2 వేల కోట్లు వసూలు చేశాయి. ఈ మేరకు సోవారం కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ లోకసభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
ఇక రేటింగ్ సంస్థలపై కేంద్రం కన్ను! ఆర్బీఐ, సెబీలకు మరిన్ని అధికారాలు...
గతంలో కంటే తగ్గింది...
2018-19 ఆర్థిక సంవత్సరంలో మినిమం బ్యాలెన్స్ లేనందుకు గాను సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్ నుంచి జరిమానా రూపంలో PSBలు వసూలు చేసిన మొత్తం రూ.1,996.46 కోట్లు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం అంటే 2017-18లో ఇది రూ.3,368 కోట్లకు పైగా ఉంది. ఇది 18 PSBలు వసూలు చేసిన మొత్తం. అంటే అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది తగ్గుముఖం పట్టింది. కానీ 2016-17తో పోలిస్తే మాత్రం పెరిగింది. నాడు జరిమానాల రూపంలో వసూలు చేసిన మొత్తం రూ.790.22 కోట్లుగా ఉంది.
SBI ఫైన్...
ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంకు SBI 2017 అక్టోబర్ 1వ తేదీ నుంచి అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ లేనిపక్షంలో వేస్తున్న ఫైన్ను చాలా వరకు తగ్గించినట్లు కేంద్రమంత్రి తెలిపారు. SBI వసూలు చేస్తున్న జరిమానాలపై విమర్శలు రావడంతో 2017 అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ ఛార్జీలను గణనీయంగా తగ్గించింది.
BSBD ఖాతాలు..
బేసిక్ సేవింగ్స్ బ్యాంకు అకౌంట్స్ (BSBD) పైన ఎలాంటి మినిమం బ్యాలెన్స్ జరిమానాలు లేవని కేంద్రమంత్రి తెలిపారు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఖాతాల్లో భాగంగా వీటిని ఓపెన్ చేస్తున్నారు. కాబట్టి వీటిపై ఎలాంటి ఫైన్ లేదు. RBI ప్రకారం ఈ ఏడాది మార్చి చివరి నాటికి దేశవ్యాప్తంగా 57.3 కోట్ల BSBD ఖాతాలు ఉన్నాయి. ఇందులో జన్ ధన్ ఖాతాలు 35.27 కోట్లు.