క్రూడ్ ధరల్లో అస్థిరత: ఆ మార్క్ కంటే దిగువకే: పెట్రోల్, డీజిల్ ధరలపై
ముంబై: అంతర్జాతీయంగా మార్కెట్లో క్రూడాయిల్ ధరలో అస్థిరత ఏర్పడింది. ఒక్కరోజు ఒక్కోరకంగా ఉంటోంది. మొన్నటి వరకు 105 డాలర్లకు పైగా పలికి క్రూడాయిల్ బ్యారెల్ రేటు.. ఇప్పుడు మళ్లీ క్షీణించింది. 100 డాలర్ల కంటే దిగువకు ట్రేడ్ అవుతోంది. 100 డాలర్ల కంటే దిగువకు క్రూడ్ రేటు చేరుకోవడం రెండు వారాల వ్యవధిలో ఇది రెండోసారి.
బ్రెంట్.. డబ్ల్యూటీఐల్లో..
బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్లో బ్యారెల్ క్రూడాయిల్ 98.75 డాలర్లు పలుకుతోంది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్లోనూ ఈ ధరలో పెరుగుదల చోటు చేసుకుంది. అక్కడ ఒక బ్యారెల్ క్రూడాయిల్ రేటు 95.09 వద్ద ట్రేడింగ్ నమోదైంది. ఇదివరకు క్రూడాయిల్ బ్యారెల్ ధర 120 నుంచి 123 డాలర్ల వరకు వెళ్లింది.
పాతధరలే..
చమురు కంపెనీలు కొద్దిసేపటి కిందటే జారీ చేసిన ధరల ప్రకారం.. దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.96.72 పైసలు, డీజిల్ రూ.89.62 పైసలు పలుకుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వం రెండోసారి వ్యాట్ను తగ్గించిన తరువాత ముంబైలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.111.35 నుంచి 106.35 పైసలకు తగ్గింది. డీజిల్ రూ.97.28 పైసల నుంచి 94.28 పైసలకు క్షీణించింది.
విశాఖపట్నంలో..
కోల్కతలో పెట్రోల్ రూ.106.03 పైసలు, డీజిల్ రూ.92.76 పైసలుగా ఉంటోంది. చెన్నైలో పెట్రోల్ రేటు రూ.102.63 పైసలు, డీజిల్ 94.24 పైసలు. బెంగళూరులో పెట్రోల్ రూ.101.94 పైసలు, డీజిల్ రూ.87.89 పైసలుగా ఉంటోంది. లక్నోలో పెట్రోల్ రూ.96.57 పైసలు, డీజిల్ 89.76 పైసలు, విశాఖపట్నంలో పెట్రోల్ రూ.110.48 పైసలు, డీజిల్ 98.38 పైసలుగా నమోదైంది.
వ్యాట్ తగ్గింపు..
అహ్మదాబాద్లో పెట్రోల్ రూ.96.63 పైసలు, డీజిల్ 92,38 పైసలు, హైదరాబాద్లో పెట్రోల్ రూ.109.66 పైసలు, డీజిల్ రూ.97.82 పైసలు, పాట్నాలో పెట్రోల్ 107.24 పైసలు, డీజిల్ రూ.94.04 పైసలు పలుకుతోంది. తిరువనంతపురంలో పెట్రోల్ 107.87 పైసలు, డీజిల్ రూ.96.67 పైసలుగా నమోదైంది. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన తరువాత మూడు రాష్ట్రాలు మాత్రమే తాము వసూలు చేస్తోన్న విలువ ఆధారిత పన్నును తగ్గించాయి.
ఈ రాష్ట్రాల్లో..
రాజస్థాన్, కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ను కుదించాయి. మహారాష్ట్ర ప్రభుత్వం రెండుసార్లు వ్యాట్ తగ్గించింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్ ధరలపై అమలు చేస్తోన్న వ్యాట్ను తగ్గించడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు.. ఇదివరకట్లా. గతంలో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని కుదించిన అనంతరం మెజారిటీ రాష్ట్రాలు అదే దారిలో నడిచిన విషయం తెలిసిందే.