రూపాయి దెబ్బ - వాహనదారులు అబ్బ: భారీ బాదుడుకు రెడీగా ఉండండమ్మా..!!
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గాయి. 80 డాలర్ల కంటే దిగువకు చేరుకుంటోన్నాయి. బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్లో బ్యారెల్ ఒక్కింటికి 86.65 డాలర్లు పలికింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్లో ఈ ధర మరింత తక్కువగా కనిపించింది. 79.43 డాలర్ల వద్ద ట్రేడింగ్ నమోదైంది.
తగ్గని పెట్రో ప్రైస్
క్రూడాయిల్ ధర నేలకు దిగినప్పటికీ- పెట్రోల్, డీజిల్ రేట్లల్లో ఎలాంటి మార్పు లేకపోవడం పట్ల వాహనదారుల్లో అసహనం వ్యక్తమౌతోంది. ఇదివరకు ముడిచమురు ధరలకు అనుగుణంగా భారీగా పెంచుకుంటూ పోయిన పెట్రో రేట్లను ఇప్పుడు చమురుు కంపెనీలు ఎందుకు తగ్గించట్లేదనే ప్రశ్న తలెత్తుతోంది.
1 నుంచి ఛాన్స్..
అదే సమయంలో డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ భారీగా పతనమైంది. ఒక డాలర్కు రూ.81.20 పైసలను చెల్లించాల్సి వస్తోంది. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం మరోసారి ఇంధన ధరలను పెంచడానికి రంగం సిద్ధం చేస్తోంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి పెట్రోల్-డీజిల్ రేట్లు పెంచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రూపాయి విలువ పతనం కావడం వల్ల పడిన అదనపు భారాన్ని వాహనదారుల నుంచి వసూలు చేసుకోనుంది కేంద్రం.
ఇప్పటికే మోత..
ఆయిల్ కంపెనీలు కొద్దిసేపటి కిందటే జారీ చేసిన ఇవ్వాళ్టి కొత్త ధరల ప్రకారం.. ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.96.72 పైసలు, డీజిల్ రూ.89.62 పైసలు పలుకుతోంది. ముంబైలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.111.35 నుంచి 106.35 పైసలకు తగ్గింది. డీజిల్ రూ.97.28 పైసల నుంచి 94.28 పైసలకు క్షీణించింది.
విశాఖలో..
కోల్కతలో పెట్రోల్ రూ.106.03 పైసలు, డీజిల్ రూ.92.76 పైసలుగా ఉంటోంది. చెన్నైలో పెట్రోల్ రేటు రూ.102.63 పైసలు, డీజిల్ 94.24 పైసలుగా నమోదైంది. బెంగళూరులో పెట్రోల్ రూ.101.94 పైసలు, డీజిల్ రూ.87.89 పైసలుగా ఉంటోంది. లక్నోలో పెట్రోల్ రూ.96.57 పైసలు, డీజిల్ 89.76 పైసలు, విశాఖపట్నంలో పెట్రోల్ రూ.110.48 పైసలు, డీజిల్ 98.38 పైసలుగా రికార్డయింది.
హైదరాబాద్లో..
అహ్మదాబాద్లో పెట్రోల్ రూ.96.63 పైసలు, డీజిల్ రూ.92.38 పైసలుగా రికార్డయింది. హైదరాబాద్లో పెట్రోల్ రూ.109.66 పైసలు, డీజిల్ రూ.97.82 పైసలు, పాట్నాలో పెట్రోల్ 107.24 పైసలు, డీజిల్ రూ.94.04 పైసలు పలుకుతోంది. తిరువనంతపురంలో పెట్రోల్ 107.87 పైసలు, డీజిల్ రూ.96.67 పైసలుగా నమోదైంది.
వ్యాట్ తగ్గించే సాహసం చేయని రాష్ట్రాలు..
కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన తరువాత మూడు రాష్ట్రాలు మాత్రమే తాము వసూలు చేస్తోన్న విలువ ఆధారిత పన్నును తగ్గించాయి. రాజస్థాన్, కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ను కుదించాయి. మహారాష్ట్ర ప్రభుత్వం రెండుసార్లు వ్యాట్ తగ్గించింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్ ధరలపై అమలు చేస్తోన్న వ్యాట్ను తగ్గించడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం రెండుసార్లు వ్యాట్ను తగ్గించింది.