ఇకపై పేటీఎం లోన్లు: త్వరలోనే దేశవ్యాప్తంగా అమలు!
డిజిటల్ పేమెంట్స్ సేవలు అందించే పేటీఎం... మరో కొత్త సర్వీస్ లోకి ప్రవేశించబోతోంది. త్వరలోనే ఆన్లైన్ లో రుణాలను కూడా మంజూరు చేయాలని భావిస్తోంది. అన్నీ కుదిరితే త్వరలోనే దేశవ్యాప్తంగా ఈ సేవలను అందించాలని యోచిస్తోంది. తనకున్న కోట్ల మంది యూసర్ బేస్ ఇందుకు దోహదపడనున్నట్లు పేటీఎం చెబుతోంది. ఇటీవల కాలంలో ఇండియా లో ఫిన్ టెక్ కంపెనీల హవా నడుస్తోంది. చాలా కంపెనీలు డిజిటల్ రుణాలను మంజూరు చేస్తున్నాయి. మొబైల్ ఆప్ ఆధారితంగా అన్ని డాక్యూమెంట్లను ఆన్లైన్ లోనే పరిశీలించి వినియోగదారులకు రుణాలను మంజూరు చేస్తున్నారు.
ఈ విభాగంలో మెరుగైన ఆదాయం ఉండటం తో మిగితా కంపెనీల దృష్టి ఇటువైపు మళ్లుతోంది. పేటీఎం కూడా దీనికి ఆకర్షితమై ఆన్లైన్ లెండింగ్ లోకి ప్రవేశిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. విజయ్ శేఖర్ శర్మ స్థాపించిన పేటీఎం దేశంలో డిజిటల్ విప్లవం తీసుకొచ్చింది. కోట్ల మంది వినియోగదారులు ప్రతి రోజు అనేక రకాల చెల్లింపుల కోసం పేటీఎం సేవలు వినియోగిస్తున్నారు. దేశం నుంచి విజయవంతమైన స్టార్టుప్ కంపెనీల్లో ముందు వరుసలో ఉన్న పేటీఎం ఇప్పటికీ నష్టాల బాటనే నడుస్తోంది. ఇందులోనుంచి బయట పడేందుకు, లాభాల బాట పట్టేందుకు ఉన్న అన్ని అవకాశాలను పేటీఎం అన్వేషిస్తోంది.
IRCTC tatkal: తత్కాల్ బుకింగ్ రూల్స్, టైమింగ్స్, ఛార్జీలు
క్లిక్స్ కాపిటల్ తో జట్టు...
ఆన్లైన్ లో రుణాలు అందించాలంటే సంబంధిత లైసెన్సు ఉండాలి. దీనిని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ లైసెన్స్ కలిగి ఉన్న క్లిక్స్ కాపిటల్ అనే సంస్థతో పేటీఎం జట్టు కట్టింది. ఇప్పటికే ఆన్లైన్ రుణాలు మంజూరు చేసే ప్రక్రియను పైలట్ తరహాలో ప్రారంభించింది. అయితే దీనిని ఇకపై దేశవ్యాప్తంగా అమలు చేయటమే తమ లక్ష్యమని పేటీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సౌరభ్ శర్మ తెలిపారు. ఈ విషయాన్ని ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది. ఈ సేవలు అందించేందుకు మరికొన్ని ఆర్థిక సర్వీసుల సంస్థలతోనూ పేటీఎం అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకుంది. రుణాల మంజూరు తో పాటుగా దానికి సంబంధించిన అనేక రకాల సేవలను కూడా అందించే యోచనలో ఉంది. వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ అనే కంపెనీ పేటీఎం బ్రాండ్ ఓనర్ అన్న విషయం విదితమే.
15 కోట్ల యూజర్లు...
డిజిటల్ పేమెంట్స్ రంగంలో దేశంలోనే పేటీఎం నెంబర్ 1 కంపెనీగా అవతరించింది. ఈ-కామర్స్, పేమెంట్ గేట్ వే, ఆన్లైన్ రీఛార్జ్, టిక్కెట్ల విక్రయం వంటి విభిన్న రంగాల్లో కూడా పేటీఎం తన సేవలు అందిస్తోంది. ప్రస్తుతం కంపెనీ కి సుమారు 15 కోట్ల మంది యూజర్లు (వినియోగదారులు) ఉన్నారు. అందులో 1.5 కోట్ల మంది మర్చంట్స్ (వ్యాపారులు) ఉన్నారు. కాబట్టి అటు వినియోగదారులకు చిన్న మొత్తాల రుణాలు ఇవ్వటం తో పాటు, ఇటు వ్యాపారులకు క్రెడిట్ ఫెసిలిటీ ఇవ్వటం ద్వారా తన సేవలను విస్తృతం చేసుకోవచ్చని పేటీఎం భావిస్తోంది. ఇంత పెద్ద ఎత్తున ఉన్న వినియోగదారుల నుంచి రాబడిని ఆర్జించేందుకు ఉన్న అన్ని రకాల అవకాశాలను పేటీఎం అందిపుచ్చుకోవాలని భావిస్తోంది.
లైసెన్సు పై కన్ను...
పేటీఎం కు ప్రస్తుతం చెల్లింపుల బ్యాంకు (పేమెంట్స్ బ్యాంకు ) లైసెన్స్ ఉంది. కానీ దీని ద్వారా రుణాలు ఇవ్వటం కుదరదు. అందుకే, ప్రస్తుతానికైతే నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ లైసెన్సు కలిగిన సంస్థలతో కలిసి పనిచేయాలని యోచిస్తున్న పేటీఎం... త్వరలోనే ఈ లైసెన్సు కోసం దరఖాస్తు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా వద్ద ఎన్బీఎఫ్సి లైసెన్సు దరఖాస్తు విషయాన్ని తాము పరిశీలిస్తున్నట్లు శర్మ వెల్లడించటం విశేషం. అంటే, ఇకపై పేటీఎం పూర్తిస్థాయి లో ఆన్లైన్ రుణాలు మంజూరు చేయబోతోందన్నమాట. తొలుత చిన్న రుణాలతో ప్రారంభించి, లైసెన్సు వచ్చిన తర్వాత పెద్ద పెద్ద రుణాలు కూడా మంజూరు చేస్తుందేమో చూడాలి.