3 కోట్లమంది ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారు, త్వరగా దాఖలు చేయండి
ఆదాయపు పన్ను రిటర్న్స్ చెల్లింపుదారులు 2021-22 అసెస్మెంట్ ఏడాదికి గాను సాధ్యమైనంత త్వరగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలని ఆదాయపు పన్ను శాఖ సూచించింది. ఐటీ రిటర్న్స్ గడువు దాఖలు చేయడానికి గడువు డిసెంబర్ 31వ తేదీ వరకు మాత్రమే ఉంది. ఈ-మెయిల్స్, ఎస్సెమ్మెస్లు, మీడియా ప్రచార కార్యక్రమాల ద్వారా ఐటీ రిటర్న్స్ దాఖలుపై రిమైండర్లు పంపిస్తోంది. ఇప్పటి వరకు మూడు కోట్ల ఐటీ రిటర్న్స్ దాఖలయ్యాయని, ఇప్పుడు రోజుకు నాలుగు లక్షలకు పైగా ఐటీ రిటర్న్స్ దాఖలవుతున్నట్లు ఓ అధికారి తెలిపారు.
వార్షిక సమాచార ప్రకటనలో అందించిన సమాచారాన్ని తమ బ్యాంకు పాస్ పుస్తకం, వడ్డీ సర్టిఫికెట్, ఫామ్ 16, బ్రోకరేజీ సంస్థలు అందించే మూలధన లాభాల నివేదికలోని సమాచారంతో సరిపోల్చుకోవాలని సూచించింది. ఐటీ రీఫండ్ మొత్తాన్ని డిపాజిట్ చేయడానికి ఇచ్చిన బ్యాంకు ఖాతాలో పాన్ నెంబర్ నమోదై ఉండేలా చూసుకోవాలని తెలిపింది.
2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికి మూడు కోట్లకు పైగా ఐటీ రిటర్న్స్ దాఖలయ్యాయని ఆర్థిక శాఖ తెలిపింది. ఈ నెల 31 వరకు గడువు ఉందని తెలిపింది. ఇప్పటివరకు సమర్పించిన 3.03 కోట్ల ఐటీఆర్లలో ఐటీఆర్-1లు 1.78 కోట్లు (58.98 శాతం), ఐటీఆర్-2లు 24.42 లక్షలు, ఐటీఆర్-3లు 26.58 లక్షలు, ఐటీఆర్-4లు 70.07 లక్షలు, ఐటీఆర్-5లు 2.14 లక్షలు, ఐటీఆర్-6లు 91,000, ఐటీఆర్-7లు 15,000 ఉన్నాయని వెల్లడించింది.