భారీగా పెరుగుతున్న ఉల్లి ధరలు, కిలో రూ.100కు చేరిన ధర
ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా ఉల్లి పండించే రాష్ట్రాల్లో పంట దెబ్బతిన్నది. దీంతో ఉల్లి దిగుబడి తగ్గింది. ఈ కారణంగా ధరలు పెరుగుతున్నాయి. ఉల్లి క్వింటాల్ ధర కొన్ని ప్రాంతాల్లో ఏకంగా రూ.7000కు పెరిగింది. మరోవైపు డిమాండుకు తగ్గిన సరఫరా లేదు. ఆసియా అతిపెద్ద మార్కెట్ లాసాగాన్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీలో (APMC) క్వింటాల్ ఉల్లి ధర గురువారం ఏకంగా రూ.1000 పెరిగి రూ.7000కు చేరుకుంది.
కిలో ఉల్లి రూ.100 వరకు
దీంతో ఉల్లి ధర ఇప్పుడు కొన్నిచోట్ల కిలో రూ.100 వరకు పెరిగింది. ఈ ఏడాది మార్చి నెలలో కిలో రూ.11 లేదా రూ.12 ఉన్న ధర ఇపుడు రూ.100కి చేరుకుంది. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల నుంచి ఉల్లి దిగుమతి అవుతాయి. కానీ ఈసారి భారీ వర్షాల కారణంగా పంట దిగుబడి లేకపోవడంతో ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
హోల్ సేల్ ధరలు కూడా..
ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు మహారాష్ట్ర, కర్నాటకల నుంచి ఉల్లి దిగుమతి అయ్యేది. కానీ పంట నష్టం కారణంగా హైదరాబాద్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. సాధారణంగా ఉల్లి కిలో రూ.15 వరకు ఉంటుంది. కానీ గత ఆరు నెలలుగా ఈ ధరలు పెరుగుతున్నాయి. హోల్ సేల్ ధర కిలో రూ.70 నుంచి రూ.90 వరకు విక్రయిస్తున్నారు. రిటైల్ కేజీ రూ.100 వరకు ఉంటోంది. కొంత వ్యత్యాసంతో దాదాపు అంతటా ఇవే ధరలు ఉన్నాయి.
ప్రభుత్వం చర్యలు
ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో కిలో ఉల్లి రూ.15 నుంచి రూ.20 వరకు లభించింది. జూన్ నెలలో కిలో ఉల్లి రూ. 25కి పెరిగింది. ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో రూ.50 నుంచి రూ.70కి పెరిగింది. ఇప్పుడు పలుచోట్ల ఏకంగా రూ.100కు చేరుకుంది. కాగా, ఉల్లి ధరలు భారీగా పెరుగుతుండటంతో మోడీ ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది. 1.2 లక్ష టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకోవాలని రెండు రోజుల క్రితం కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఇది వినియోగదారులకు ఊరట కల్పించనుంది.