NSE Scam: సీబీఐకి నోటీసులు: హైకోర్టు కీలక ఆదేశాలు: విచారణ వాయిదా
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ కో లొకేషన్ కుంభకోణం కేసు మరోసారి చర్చల్లోకి వచ్చింది. ఈ కుంభకోణంలో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలను ఎదుర్కొంటోన్న ఎన్ఎస్ఈ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ చిత్ర రామకృష్ణ బెయిల్ పిటీషన్ దీనికి కారణమైంది. ఈ బెయిల్ పిటీషన్ విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు- కేంద్రీయ దర్యాప్తు సంస్థ సీబీఐకి నోటీసులను జారీ చేసింది. బెయిల్పై తన అభిప్రాయాన్ని తెలియజేయాలంటూ ఆదేశించింది.
ఎన్ఎస్ఈ కో లొకేషన్ కుంభకోణం వ్యవహారంలో చిత్ర రామకృష్ణ ఇదివరకే అరెస్టయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె సీబీఐ అధికారుల కస్టడీలో ఉన్నారు. విచారణను ఎదుర్కొంటోన్నారు. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఇదివరకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. ఆరోగ్యం, ఇతరత్రా కారణాలతో బెయిల్ కల్పించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ పిటీషన్ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తోసిపుచ్చింది.
విచారణ కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వలేమని సీబీఐ న్యాయస్థానం స్పష్టం చేస్తూ ఆదేశాలను జారీ చేసింది. దీని తరువాత చిత్ర రామకృష్ణ- ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ను ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. సీబీఐకి నోటీసులను జారీ చేసింది. చిత్ర రామకృష్ణ బెయిల్ విషయంలో తన అభిప్రాయాలను తెలియజేయాలంటూ సూచించింది.
ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుధీర్ కుమార్ జైన్.. సీబీఐ నోటీసులు ఇచ్చారు. అనంతరం ఈ పిటీషన్పై విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేశారు. ఈ నెల 12వ తేదీన చిత్ర రామకృష్ణ బెయిల్ పిటీషన్ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తోసిపుచ్చిన విషయం తెలిసిందే. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయలేమంటూ న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. కో లొకేషన్ కుంభకోణంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్కు చెందిన కొందరు మాజీ ఉన్నతాధికారులు అరెస్ట్ అయ్యారు.