దేశవ్యాప్తంగా సీబీఐ విస్తృత దాడుల కలకలం: ఆ బ్రోకర్ల నివాసాలే టార్గెట్
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ కో లొకేషన్ కుంభకోణం కేసు మరో మలుపు తీసుకుంది. ఈ కుంభకోణంలో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలను ఎదుర్కొంటోన్న ఎన్ఎస్ఈ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ చిత్ర రామకృష్ణ బెయిల్ పిటీషన్ విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు- కేంద్రీయ దర్యాప్తు సంస్థ సీబీఐకి నోటీసులను జారీ చేసింది. నోటీసులను అందుకున్న మరుసటి రోజే సీబీఐ అధికారులు దేశవ్యాప్తంగా పలు చోట్ల విస్తృతంగా దాడులు చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఎన్ఎస్ఈ కో లొకేషన్ కుంభకోణం వ్యవహారంలో చిత్ర రామకృష్ణ ఇదివరకే అరెస్టయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె సీబీఐ అధికారుల కస్టడీలో ఉన్నారు. విచారణను ఎదుర్కొంటోన్నారు. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఇదివరకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. ఆరోగ్యం, ఇతరత్రా కారణాలతో బెయిల్ కల్పించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ పిటీషన్ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తోసిపుచ్చింది.
విచారణ కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వలేమని సీబీఐ న్యాయస్థానం స్పష్టం చేస్తూ ఆదేశాలను జారీ చేసింది. దీని తరువాత చిత్ర రామకృష్ణ- ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ను ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. సీబీఐకి నోటీసులను జారీ చేసింది. చిత్ర రామకృష్ణ బెయిల్ విషయంలో తన అభిప్రాయాలను తెలియజేయాలంటూ సూచించింది.
ఈ పరిణామం చోటు చేసుకున్న మరుసటి రోజే సీబీఐ కీలక దాడులను నిర్వహించింది. ఇవ్వాళ పలు నగరాల్లో దాడులను చేపట్టింది. స్టాక్ మార్కెట్ బ్రోకర్ల నివాసాలు, కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుంది. దేశ రాజధానితో పాటు, ముంబై, కోల్కత, గాంధీనగర్, నొయిడా, గుర్గావ్లల్లో స్టాక్ మార్కెట్ బ్రోకర్ల నివాసాలు, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు చేసింది. ఈ ఉదయం ఆరంభమైన దాడులు.. మధ్యాహ్నం వరకు కూడా కొనసాగాయి.
ఈ సందర్భంగా సీబీఐ అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. విచారణ సందర్భంగా చిత్ర రామకృష్ణ పలు కీలక విషయాలను వెల్లడించారని, ఆమె ఇచ్చిన సమాచారం మేరకే ఈ దాడులు చేపట్టినట్లు చెబుతున్నారు. దీనిపై సీబీఐ అధికారిక ప్రకటన ఇంకా విడుదల చేయాల్సి ఉంది.