లాభపడిన దేశీయ స్టాక్ మార్కెట్లు: ప్రభావం చూపని జీడీపీ పతనం
ముంబై: భారత్-చైనా సరిహద్దులో మరోసారి ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సోమవారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ మార్కెట్లు.. మంగళవారం మాత్రం లాభాలబాట పట్టాయి. టెలికాం, మెటల్ షేర్ల అండతో లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 273 పాయింట్లు లాభపడి 38,900 వద్ద ముగిసింది.
ఇక నిఫ్టీ 82 పాయింట్ల లాభంతో 11,470 వద్ద స్థిరపడింది. మంగళవారం ఉదయం నుంచి మార్కెట్లు లాభాల బాటలోనే నడిచాయి. నిఫ్టీ కూడా 116 పాయింట్లు లాభపడి 11,504 వద్ద ట్రేడింగ్ అయ్యింది. అయితే, కాసేపటికే ఒత్తిడికి గురైన సెన్సెక్స్ 38,542 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. ఆ తర్వాత నెమ్మదిగా కోలుకుని చివరి వరకూ లాభాల్లో పయనించింది.
ఒకదశలో 39,226 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్ చివరకు 273 పాయింట్ల లాభంతో 38,900 వద్ద స్థిరపడింది. కరోనా వైరస్ కట్టడి చేయడానికి అమలు చేసిన లాక్డౌన్ కారణంగా ఏప్రీల్, జూన్ ట్రైమాసికంలో జీడీపీ ఏకంగా 23.9 శాతం క్షీణించినా.. మదుపర్లపై ఆ ప్రభావం పెద్దగా చూపకపోవడం గమనార్హం. అయితే, ఈ పరిణామాన్ని మదుపర్లు ముందుగా ఊహించడం వల్లే మార్కెట్లపై ఆ ప్రభావం పడనట్లు తెలుస్తోంది.
కాగా, దశలవారీ అన్లాక్ల కారణంగా వివిధ రంగాలు పుంచుకుంటుండటంతో రాబోయే త్రైమాసికాల్లో వృద్ధిరేటు క్రమంగా గాడిన పడుతుందని మదుపర్లు విశ్వసిస్తున్నారు. మంగళవారం నాటి ట్రేడింగ్లో భారతీ ఎయిర్టెల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, తదితర షేర్లు లాభపడ్డాయి. ఇక భారతీ ఇన్ఫ్రాటెల్ , ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా తదితర షేర్లు నష్టాలను చవిచూశాయి. కాగా, రూపాయితో డాలర్ మారకం విలువ 72.86 వద్ద కొనసాగుతోంది.