Gold silver: బంగారం, వెండి కొనేవారికి భారీ షాక్.. కేంద్రం తీసుకున్న ఆ కొత్త నిర్ణయం ఏంటి?
బంగారం, వెండి ప్రియులకు కేంద్ర ప్రభుత్వం ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. దేశంలో వెండి ఉత్పత్తుల దిగుమతి నిబంధనలను ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) మే 16న కీలక ప్రకటన చేస్తూ.. దేశీయ వినియోగం కోసం దిగుమతి చేసుకునే 99% స్వచ్ఛత గల వెండి బార్లను (Silver Bars) "పరిమితం" (Restricted) కేటగిరీలోకి చేర్చింది. అంటే ఇకపై వీటిని ఇండియాలోకి తీసుకురావాలంటే ప్రత్యేక అనుమతులు లేదా లైసెన్సులు ఖచ్చితంగా ఉండాలి. ఈ నిర్ణయం వల్ల లోకల్ మార్కెట్లో వెండి లభ్యత తగ్గి, అంతర్జాతీయ మార్కెట్ కంటే మన దేశంలో వెండి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ట్యాక్సులు కూడా పెరిగాయి.. ఎందుకీ నిర్ణయం?
కేవలం ఆంక్షలు మాత్రమే కాదు, పన్నుల భారం కూడా పెరిగింది. బంగారం, వెండి (gold silver) దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని గతంలో ఉన్న 6 శాతం నుంచి ఏకంగా 15 శాతానికి పెంచారు. అలాగే ప్లాటినంపై డ్యూటీని 15.4 శాతానికి పెంచారు. అనవసరమైన విదేశీ వస్తువుల దిగుమతులను తగ్గించి, మన దేశంలోనే రిఫైనింగ్ (శుద్ధి చేయడం) ప్రక్రియను, విలువ ఆధారిత ఎగుమతులను ప్రోత్సహించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం. అయితే ప్రాసెసింగ్, జ్యువెలరీ తయారీ, ఎగుమతుల కోసం తెచ్చే వెండిపై ఎలాంటి ఆంక్షలు ఉండవని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
ఇండియాలో వెండి కొరత రానుందా?
మన దేశానికి కావాల్సిన వెండి అవసరాల్లో దాదాపు 90 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. మన దేశంలో ఉత్పత్తి అయ్యేది కేవలం 10 శాతం లోపే. అది కూడా జింక్ గనుల తవ్వకాల్లో బై-ప్రొడక్ట్గా వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో దిగుమతులపై ఆంక్షలు పెట్టడం వల్ల మార్కెట్లో వెండి సప్లై తగ్గిపోతుంది. వ్యాపారులు కూడా రేట్లు పెరుగుతాయనే ఆశతో స్టాక్ను హోల్డ్ చేసే ఛాన్స్ ఉంది. దీనివల్ల సాధారణ కస్టమర్లతో పాటు సిల్వర్ ఈటీఎఫ్ (Silver ETF) ఫండ్ మేనేజర్లు కూడా వెండిని కొనడానికి ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది.
సోలార్ రంగానికి ఊరట.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
ఈ కొత్త రూల్స్ వల్ల సోలార్ ఎనర్జీ రంగానికి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. సోలార్ ప్యానెల్స్ తయారీలో వాడే వెండి ముడి ఖనిజం, వెండి రేణువులు (Granules), సిల్వర్ పేస్ట్ దిగుమతులపై ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. కాబట్టి ఆ పరిశ్రమకు ఊరట లభించినట్లే.
ఇన్వెస్టర్ల విషయానికి వస్తే.. ఈ నిర్ణయం వల్ల లోకల్ మార్కెట్లో వెండి ధరలు పెరిగి లాభాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, కొనుగోలు ఖర్చులు , మార్కెట్ అస్థిరత (Volatility) పెరిగే రిస్క్ కూడా ఉంది. ప్రభుత్వం వెండి దిగుమతులను పూర్తిగా నిషేధించలేదు, కేవలం నియంత్రించడానికి మాత్రమే ఈ చర్యలు తీసుకుంది. కాబట్టి రానున్న రోజుల్లో MCX మార్కెట్లో ధరల ట్రెండ్ను బట్టి ఇన్వెస్టర్లు అడుగులు వేయడం మంచిది.


Click it and Unblock the Notifications