New rules: నూతన నిబంధనలతో కొత్త ఆర్థిక ఏడాది ఆరంభం.. జేబు ఖాళీ చేసేవి ఏంటంటే..
New rules: నేటితో 2023 ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది. రేపటి నుంచి కొత్త ఫైనాన్షియల్ ఏడాది ప్రారంభం కానుంది. ప్రతి సంవత్సరం దేశ ప్రజలకు జనవరి 1 కంటే ఏప్రిల్ 1 ఎంతో ముఖ్యమైనది. వారి జీవితాలపై పెను ప్రభావం చూపించే రోజు అది. ఎన్నో కొత్త నియమాలు, ఆర్థిక నిబంధనల్లో మార్పులు జరుగుతాయి. అందుకే క్రితం ఏడాదిలో నిలిచిపోయిన పనులన్నిటినీ సాధ్యమైనంత వరకు మార్చి 31 లోపు పూర్తి చేయాలని ప్రయత్నిస్తుంటారు.
ఏప్రిల్ 1, 2023 నుంచి దేశంలో పెను మార్పులు సంభవించనున్నాయి. సరైన సమయంలో స్పందించకపోతే వినియోగదారుల జేబుకు చిల్లు పెట్టేవీ ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ ధరల నుంచి బ్యాంక్ సెలవుల వరకు ప్రతిదీ రోజువారీ జీవితంపై ప్రభావం చూపేవే ఎక్కువ. వాటన్నిటిపై ఓ లుక్కేద్దాం..

పెట్రో ధరల పెంపు:
కొత్త ఆర్థిక ఏడాదిలో చమురు కంపెనీలు వినియోగదారులకు షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రతినెలా మొదటి రోజున పెట్రోల్, డీజిల్ రేట్లను ఆయా సంస్థలు సవరిస్తూ ఉంటాయన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈసారి పెంపు తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. వీటితోపాటు వంటగ్యాస్ ధరల్లోనూ మార్పులు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. సాధారణ సిలిండర్ పై ఈనెలలో రూ.50 వరకు రేటు పెంచగా.. వాణిజ్య బండపై కేంద్రం రూ.350 వడ్డించింది. మరోసారి రేట్లపెంపు అంటే సామాన్యుడిపై పిడుగు పడినట్లే.
బ్యాంకు సెలవులు:
ప్రజల దైనందిన జీవితంలో బ్యాంకుల పాత్ర కీలకం. ఆర్థిక అవసరాలన్నిటి విషయమై ఎక్కువగా వీటిపైనే ఆధారపడతాం. కాగా వివిధ రాష్ట్రాల్లోని పండుగలు, వారాంతపు సెలవులు వెరసి.. ఏప్రిల్ 2023లో మొత్తం 15 రోజులపాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈమేరకు సెలవుల జాబితాను RBI ప్రకటించింది.
వేతన జీవులకు పండగే..
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను విధానం అమల్లోకి రానుంది. తద్వారా మధ్యతరగతి వేతన జీవులు పెద్దమొత్తంలో లబ్ధి పొందనున్నారు. 7 లక్షల లోపు ఆదాయం ఉండి, కొత్త ట్యాక్స్ విధానం ఎంచుకున్న ఉద్యోగులు పన్ను మినహాయింపు ప్రయోజనాలు అందుకోనున్నారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే పార్లమెంటులో ప్రకటించారు.
7 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు
కార్లధరకు రెక్కలు:
దేశంలో మారుతున్న జీవన విధానానికి అనుగుణంగా ప్రజలు సొంత వాహనాలు కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నారు. కరోనా అనంతరం ఈ తరహా ధోరణి మరింత పెరిగింది. ఇలా ఆలోచిస్తున్న వారికి ఈ ఏడాది కొంత నిరుత్సాహంతో మొదలుకాబోతోంది. ఎందుకంటే మారుతీ సుజుకి, హోండా కార్స్, టాటా మోటార్స్, హీరో మోటోకార్ప్ సహా వివిధ కంపెనీలు కార్ల ధరలు పెంచనున్నాయి. పెరిగిన ఖర్చులను పరిగణలోనికి తీసుకుంటే రేట్ల పెంపు తప్పడం లేదని కార్ల తయారీదారులు చెబుతున్నారు.
బంగారం విక్రయాల్లో పారదర్శకత:
బంగారు ఆభరణాలు విక్రయించడంలోనూ ఈ ఏడాది పెను మార్పులు జరగనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి కొనుగోలు చేసే ఆభరణాలపై 6 అంకెల హాల్ మార్క్ ఐడెంటిఫికేషన్ నంబర్ తప్పనిసరి చేస్తూ వినియోగదారుల మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 4 అంకెలను మాత్రమే ఉపయోగిస్తుండగా.. ఇక మీదట అలా చేయడం కుదరదు.


Click it and Unblock the Notifications