12 గంటల పాటు నిలిచిపోనున్న ఆదాయపు పన్ను వెబ్సైట్, ఎప్పుడంటే
కొత్త ఆదాయపు పన్ను వెబ్ సైట్ ద్వారా మీరు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలని భావిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. ఐటీ శాఖ కొత్త పోర్టల్ శనివారం అర్ధరాత్రి నుండి ఆదివారం మధ్యాహ్నం వరకు వర్క్ చేయదు. నిర్వహణ పరమైన పనుల్లో భాగంగా ఆదాయపు పన్ను వెబ్సైట్ దాదాపు పన్నెండు గంటలపాటు నిలిచిపోనుంది. శనివారం రాత్రి పది గంటల నుండి ఆదివారం ఉదయం పది గంటల వరకు సేవలు అందుబాటులో ఉండవని ఐటీ శాఖ విభాగం తన వెబ్సైట్ https:///www.incometax.gov.in ద్వారా వెల్లడించింది.
ఈ సమయంలో ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా రిటర్న్స్ సమర్పించడం సాధ్యంకాదు. ఈ వెబ్సైట్లో ఇతర సేవలు అందుబాటులో ఉండవని ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది. ఈ ఏడాది జూన్ నెలలో పోర్టల్ ప్రారంభించినప్పటి నుండి ఈ పోర్టల్లో సమస్యలు వస్తున్నాయి. ఈ వెబ్సైట్ను సిద్ధం చేసిన ఇన్ఫోసిస్ సీఈఓతో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చర్చించి, సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు.
వెబ్సైట్లో తలెత్తుతున్న సమస్యల నేపథ్యంలో రిటర్న్స్ దాఖలుకు గడువును డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగించింది. 2021-22 మదింపు సంవత్సరానికి (2020-21 ఆర్థిక సంవత్సరం) సంబంధించి ఇప్పటి వరకు రెండు కోట్ల ఆదాయపు పన్ను రిటర్న్స్ వచ్చినట్లు ఆదాయపు పన్ను విభాగం ట్విటర్లో పేర్కొంది.