అమెజాన్ జెఫ్ బెజోస్ కు ఇండియాలో ఘోర అవమానం?
ప్రపంచ కుబేరుడు, అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ కు ఇండియాలో ఘోర అవమానం ఎదురైంది. ఇండియాలో అమెజాన్ కార్యకలాపాలు మొదలైన ఆరేళ్ళ తర్వాత అయన తొలిసారి భారత్ లో పర్యటించారు. మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఇండియా కు చేరుకున్న అమెజాన్ ఫౌండర్ అండ్ సీఈఓ జెఫ్ బెజోస్ కు అడుగడునా నిరసనలు ఎదురయ్యాయి. దేశంలోని చిన్న వర్తకుల వ్యాపారాలు దెబ్బతినేలా అమెజాన్ ప్రెడేటరీ ప్రైసింగ్ మోడల్ ను అనుసరిస్తోందని ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ అంశంపై ఇప్పటికే కంపెనీ పై ఫిర్యాదులు అందాయి.
దీంతో కేంద్ర ప్రభుత్వం అమెజాన్ పై దర్యాప్తు ప్రారంభించింది. 2013 లో ఇండియా లో కార్యకలాపాలు ప్రారంభించిన ప్రపంచంలోనే అతి పెద్ద ఈ కామర్స్ కంపెనీ ఐన అమెజాన్ కు దేశీయంగా ఫ్లిప్కార్ట్ తో గట్టి పోటీ ఎదుర్కొంది. కానీ తనకున్న ఆర్థిక బలంతో, భారీ పెట్టుబడులతో పోటీలో నిలదొక్కుకుని నువ్వా - నేనా అన్నట్లు పోటీలో నిలబడింది.
ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ - అమెజాన్ లు రెండూ దాదాపు ఒకే స్థాయిలో బిజినెస్ చేస్తున్నాయి. రెండు సంస్థలకు మధ్య తేడా 5% కూడా ఉండదని అనలిస్టులు చెబుతున్నారు. అయితే, ఫ్లిప్కార్ట్ తో పోటీ ఎలా ఉన్నా... ప్రస్తుతం ఈ రెండు దిగ్గజాలు కూడా అమెరికా కంపెనీలే కావటం ప్రభుత్వానికి, ప్రజలకు ఒకింత ఆందోళనకరమైన విషయం. అమెరికా రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ రూ 1 లక్ష కోట్లకు పైగా వెచ్చించి ఫ్లిప్కార్ట్ ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
అపాయింట్మెంట్ ఇవ్వని ప్రధాని మోడీ..
సహజంగా ఒక మల్టీ నేషనల్ కంపెనీ అధినేత ఇండియా లో పర్యటిస్తున్నారంటే... వారు తప్పనిసరిగా ప్రధాని తో భేటీ అవుతారు. ఆర్థిక మంత్రి, వాణిజ్య మంత్రి తో కూడా సమావేశమవుతారు. ఎందుకంటే ఇండియాలో తమ పెట్టుబడులు, వాటి రక్షణ తదితర అంశాలపై వారు కూలంకషంగా చర్చిస్తారు. ప్రభుత్వ పెద్దలు కూడా వారిని కలిసేందుకు ప్రాధాన్యం ఇస్తారు. కానీ అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ కు మాత్రం ఇక్కడ చుక్కెదురైంది. ఆయన్ను కలిసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఇష్టపడలేదని విశ్వసనీయవర్గాల సమాచారం. అమెజాన్ ఇప్పటికే ఇండియా లో 5 బిలియన్ డాలర్ల (రూ 35,000 కోట్లు) వరకు పెట్టుబడులు పెట్టింది. మరిన్ని పెట్టుబడులకు సిద్ధంగా ఉంది. పైగా ఫ్యూచర్ గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీల్లో వాటాలు కొనుగోలు చేసింది. అయినా సరే జెఫ్ కు ప్రధాని అపాయింట్మెంట్ నిరాకరించటం పారిశ్రామిక వర్గాల్లో పెద్ద చర్చకే తెరలేపింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆకర్షించటం అన్ని ప్రభుత్వాలకు ప్రధానాంశం. మరి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్న అమెజాన్ విషయంలో ప్రభుత్వం ఎందుకు ఇలా వ్యవహరించిందో అర్థం కావటం లేదని ఈ విషయంపై అవగాహన ఉన్నవారు చెబుతున్నారు.
పుండు మీద కారం చల్లిన కేంద్ర మంత్రి...
ఒక వైపు ప్రధాని అపాయింట్మెంట్ దొరకలేదంటే.. మరోవైపు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అమెజాన్ పై సునిశిత విమర్శలు గుప్పించారు. తన పర్యటనలో భాగంగా ఇండియా లో మరో 1 బిలియన్ డాలర్ల (రూ 7,000 కోట్లు) పెట్టుబడి పెడతామని, 2025 నాటికి 10 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని జెఫ్ బెజోస్ ప్రకటించారు. దీనిపై స్పందిస్తూ... వారేమి దేశ సేవ చేయటం లేదని మంత్రి విమర్శించారు. సాధారణంగా అయితే, ఇలాంటి పెట్టుబడి ప్రతిపాదనలు, ఉపాధి కల్పన ప్రకటనలను ప్రభుత్వ పెద్దలు ఆహ్వానిస్తారు. ఆయా కంపెనీలపై పొగడ్తల వర్షం కురిపిస్తారు. వారికి ఇండియాలో సకల సౌకర్యాలు కల్పిస్తామని, త్వరితగతిన అన్ని అనుమతులు ఇస్తామని ఆర్భాటం చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయ్యింది.
పారిశ్రామికవేత్తలతో భేటీ...
తన మూడు రోజుల పర్యటన సందర్భంగా జెఫ్ బెజోస్ .. ఇండియా లోని ప్రముఖ పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. ఇండియాలో అపర కుబేరుడు ఐన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీతో జెఫ్ బెజోస్ ముంబై లోని ఒక స్టార్ హోటల్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ రజనీష్ కుమార్, ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, ఫ్యూచర్ గ్రూప్ కిషోర్ బియాని, గోద్రెజ్ అధినేత అది గోద్రెజ్, ఎయిర్టెల్ అధినేత సునీల్ భారతి మిట్టల్, ఓలా ఫౌండర్ భవిష్ అగర్వాల్ వంటి ప్రముఖులు హాజరైనట్లు సమాచారం. జెఫ్ బెజోస్ తో పాటు అమెజాన్ ఇండియా హెడ్ అమిత్ అగర్వాల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇండియా లో పెట్టుబడులు, వ్యాపార అవకాశాలు, ఆర్థిక వ్యవస్థ తీరు తెన్నులు, భవిష్యత్ లక్ష్యాలపై వీరు కూలంకషంగా చర్చించుకున్నట్లు తెలిసింది. ఈ సమావేశంతో జెఫ్ బెజోస్ తన ఇండియా పర్యటన ముగించి అమెరికా వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా, పెట్టుబడిదారులతో ప్రభుత్వం ఇలా వ్యవహరించటం సరికాదని, ఇలాగైతే వారు ఇక్కడ పెట్టుబడులకు ఆసక్తి చూపరని మన ఇండస్ట్రియలిస్టులు పేర్కొంటున్నారు.