Jio IPO: బిగ్గెస్ట్ పబ్లిక్ ఇష్యూ: రూ.7.5 లక్షల కోట్లు టార్గెట్
ముంబై: దేశీయ పారిశ్రామిక దిగ్గజం, అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ.. తన ఆస్తులను మరింత భారీగా పెంచుకోబోతోన్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ ఆయన పూర్తి చేసుకుంటోన్నారు. 100 బిలియన్ డాలర్ల మేర నిధులను సమీకరించుకోవడానికి సమాయాత్తమౌతోన్నారు. ఈ 100 బిలియన్ డాలర్లను రూపాయల్లోకి మార్చుకుంటే- దీని విలువ దాదాపు ఏడున్నర లక్షల కోట్లు. అంతర్జాతీయ ఫైనాన్షియల్ రీసెర్చ్ ఏజెన్సీ సీఎల్ఎస్ఏ ఈ మేరకు ఓ నోట్ను విడుదల చేసింది.
లార్జెస్ట్ టెలికం కంపెనీగా..
దేశీయ టెలికం సెక్టార్..మొబైల్ ఫోన్ల సెగ్మెంట్ను ఏలుతున్న రిలయన్స్ జియో కంపెనీ ద్వారా ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)ను జారీ చేయడానికి ముఖేష్ అంబానీ సన్నాహాలు చేస్తోన్నారని సీఎల్ఎస్ఏ పేర్కొంది. దేశంలో లార్జెస్ట్ టెలికం సర్వీస్ ప్రొవైడర్గా కొనసాగుతోంది రిలయన్స్ జియో. టెలికం రెగ్యులేటరీ అథారిటీ వద్ద ఉన్న రికార్డుల ప్రకారం.. గత ఏడాది అక్టోబర్ నాటికి రిలయన్స్ జియోకు ఉన్న సబ్స్క్రైబర్ బేస్ 426.5 మిలియన్లు.
ఈ ఏడాదే జారీ..
2022-23 ఆర్థిక సంవత్సరం రెండు లేదా మూడో త్రైమాసికంలో రిలయన్స్ జియో పబ్లిక్ ఇష్యూ జారీ చేసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ఏడాదే అది స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్టింగ్ అవుతుందనీ పేర్కొంది.
తొలుత ఐపీఓను జారీ చేయడం, ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులను సేకరించడం ఆ తరువాత స్టాక్ ఎక్స్ఛేేంజ్లో లిస్టింగ్కు వెళ్లడం స్టాక్ మార్కెట్ సంప్రదాయం. దీనికి భిన్నంగా నేరుగా లిస్టింగ్కు వెళ్లాలని రిలయన్స్ యాజయాన్యం భావిస్తున్నట్లు సీఎల్ఎస్ఏ అభిప్రాయపడింది.
వేర్వేరు కంపెనీలకు స్టేక్స్
రిలయన్స్ జియోలో 33 శాతం స్టేక్స్ వేర్వేరు కంపెనీలకు ముఖేష్ అంబానీ విక్రయించిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్-10, టాప్ సెర్చింజిన్ గూగుల్-8 శాతం మేర రిలయన్స్ జియోలో పెట్టుబడులు పెట్టాయి. ఇంటెల్ క్యాపిటల్, క్వాల్కామ్ వెంచర్స్తో పాటు టాప్ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పార్ట్నర్స్, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్ వంటివి జియోలో పెట్టుబడులు పెట్టాయి.
బిగ్గెస్ట్ ఐపీఓగా..
ఆయా కంపెనీల నుంచి జియోలోకి పెట్టుబడులు ప్రవహించాయి. ఆయా కంపెనీలు పెట్టిన పెట్టబడుల విలువ సుమారు 1.52 లక్షల కోట్ల రూపాయలు. ఇలా మొత్తం 13 కంపెనీలకు జియోలో 33 శాతం మేర వాటాలు ఉన్నాయి. ఆయా కంపెనీలకు వాటాలు ఉన్నందున సపరేట్ లిస్టింగ్ చేయాలని రిలయన్స్ మేనేజ్మెంట్ యోచిస్తున్నట్లు సీఎల్ఎస్ఏ పేర్కొంది. ఏడున్నర లక్షల కోట్ల రూపాయల మేర విలువ గల పబ్లిక్ ఇష్యూను రిలయన్స్ జియో జారీ చేస్తే.. ఇదే బిగ్గెస్ట్ ఐపీఓగా నిలుస్తుంది.
ఎల్ఐసీ కంటే..
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న జీవిత బీమా సంస్థ పబ్లిక్ ఇష్యూ వాల్యుయేషన్ ప్రైస్ 70 నుంచి 75 వేల కోట్ల రూపాయలుగా ఉండొచ్చంటూ అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. దీన్ని కూడా అధిమిస్తుంది రిలయన్స్ జియో ఐపీఓ. ఈ సంవత్సరమే ఎల్ఐసీ ఐపీఓ కూడా రావడం ఖాయంగా కనిపిస్తోంది. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే- మార్చి 31వ తేదీ నాటికి ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ జారీ అవుతుంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. త్వరలో సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డుకు రెడ్ హర్రెంట్ ప్రాస్పెక్టస్ను అందజేయనుంది.