కరోనా వైరస్: అయినా పని చేస్తామంటున్న కంపెనీలు!
ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్... భారత్ ను ఇబ్బందికి గురిచేస్తోంది. చైనాలో మొదలైన ఈ మాయదారి వైరస్.. అక్కడ సుమారు 3,300 మందిని పొట్టనబెట్టుకొని ప్రపంచం మీద పడిపోయింది. ఇప్పుడు కరోనా పుట్టినిల్లు ఐన చైనా ను కూడా వెనక్కు నెట్టేలా అమెరికా, ఇటలీ, స్పెయిన్ వంటి ఎంతో అభివృద్ధి చెందిన దేశాల్లో కరోనా వైరస్ ధాటికి అధిక మరణాలు నమోదవుతున్నాయి. ఇప్పటికే అమెరికాలో లక్ష మందికి పైగా కరోనా వైరస్ సోకి చికిత్స పొందుతుండగా.. 2,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటలీ లో అయితే మరీ ఘోరం. ఇప్పటికే 10,000 మంది మృతి చెందారు. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 198 దేశాల్లో 7.2 లక్షల మందికి పైగా కరోనా పాజిటివ్ అని తేలింది. ఇక 34,000 మంది మరణించారు. మన ఇండియా విషానికి వస్తే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,000 దాటింది. 27 మంది చనిపోయినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ మహమ్మారిని ఎలాగైనా సరే ఇండియాలో కట్టడి చేయాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రం ప్రభుత్వాలు కలిసి ఒక యుద్ధమే చేస్తున్నాయి. 21 రోజుల సంపూర్ణ లాక్ డౌన్ తో ప్రస్తుతం కంట్రీ మొత్తం బందీ అయిపోయింది.
వేతనాలు కట్ చేస్తాం.. జీతాలివ్వం: ఉద్యోగులకు షాక్, ఈ కంపెనీలు మాత్రం శాలరీ పెంచాయి
సరికొత్త వ్యూహాలు...
ఇండియాలో నెలకొన్న లాక్ డౌన్ నేపథ్యంలో దేశంలోని కార్పొరేట్ కంపెనీలు సరికొత్త వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. వ్యాపారాలను కొనసాగించేందుకు తగిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అత్యయిక పరిస్థితుల్లో కంపెనీల బిజినెస్ కంటిన్యుటీ ఎలా ఉండాలనే అంశంపై తీవ్రంగా ఆలోచిస్తున్నాయి. దీనిపై ప్రముఖ జాబ్ పోర్టల్ ఇండీడ్ నిర్వహించిన ఒక సర్వే లో 64% భారతీయ కంపెనీలు కరోనా వైరస్ పరిస్థితులను తట్టుకుని పనిచేసేలా సిద్ధమవుతున్నట్లు వెల్లడించాయి. చిన్న తరహా కంపెనీల్లో సైతం 3% సంస్థలు ఈ పరిస్థితులకు అలవాటు పడుతున్నట్లు తెలిపాయి. మరోవైపు భారీ స్థాయి కంపెనీలు సైతం పరిస్థితికి తగ్గట్లు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు పేర్కొంటున్నాయి. వర్క్ ఫ్రొం హోమ్ అనే కాన్సెప్ట్ ఐటీ సహా దాని అనుబంధ రంగాలకు కొత్తదేమీ కాదు కానీ... ఇతర రంగాల్లో అది కొత్తదే. అందుకే, దీనిని సపోర్ట్ చేసేలా కంపెనీలు తమ మానవ వనరుల విధానాలను రూపొందించుకుంటున్నాయి.
50% మందికి గుడ్ బై...
ఈ కష్ట కాలంలో మెజారిటీ కంపెనీలు అధిక ప్రాధాన్యం ఉన్న ఉద్యోగులను మినహాయించి తాత్కాలిక ఉద్యోగులను, ఫ్రీ లాన్సర్ల ను తొలగించటం ప్రారంభించాయి. ఇప్పటికే ఈ మేరకు సుమారు 50% కంపెనీలు తమ తాత్కాలిక ఉద్యోగులకు గుడ్ బై చెప్పేసినట్లు ఇండీడ్ సర్వే లో తేలింది. అలాగే, లాక్ డౌన్ సమయంలో కొత్త హైరింగ్ ఆక్టివిటీ బాగా దెబ్బతింది. సుమారు 36% కంపెనీలు తమ కార్యకలాపాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో కొత్త హైరింగ్ పై దీని ప్రభావం పడుతోంది. ఈ సర్వే కోసం ఇండీడ్ సుమారు 150 కంపెనీలను సంప్రదించింది. వాటి నుంచి ప్రస్తుత పరిణామాల్లో వ్యాపారాలను ఎలా కొనసాగిస్తున్నాయి, కొత్తగా ఎలాంటి విధానాలు అమలు చేస్తున్నాయి అనే అంశాలపై పలు ప్రశ్నలు సంధించింది. ఇప్పుడు చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రొం హోమ్ జాబ్స్ కోసం ఎక్కువగా సెర్చ్ చేస్తున్నట్లు ఈ సర్వే లో తేలింది.
టెక్నాలజీ సాయం...
కరోనా వైరస్ దెబ్బతో దేశవ్యాప్తంగా అన్ని రంగాలు భారీ స్థాయిలో ప్రభావితం అవుతున్నాయి. అయితే, తొలుత ఆందోళన చెందిన కంపెనీలు మెల్లిగా ఆ పరిస్థితుల నుంచి బయటపడేందుకు సిద్ద్ధమవుతున్నారు. ఇందుకోసం టెక్నాలజీ సాయం తీసుకుంటున్నాయి. అందుబాటులో ఉన్న ఉద్యోగులతో పూర్తిస్థాయి కార్యకలాపాల కొనసాగింపు పై దృష్టి సారిస్తున్నాయి. ఉద్యోగులతో వర్చువల్ గా కనెక్ట్ అయ్యే సాఫ్ట్ వేర్ లను ఏర్పాటు చేసుకొని ముందుకు సాగుతున్నాయి. ఇప్పటి వరకు పూర్తిగా మాన్యువల్ గా జరిగే పనుల స్థానంలో ఆటోమేషన్ ను ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో ప్రస్తుత గడ్డు పరిస్థితుల నుంచి బయట పడటంతో పాటు భవిష్యత్ లో ఇలాంటి సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కంపెనీలకు మార్గం సుగమం అవుతుంది. అలాగే ఉత్పాదకత కూడా పెరుగుతుంది. దీంతో సంక్షోభాల్లోనూ కంపెనీలు మన గలుగుతాయి.