మైక్రోసాఫ్ట్-తెలంగాణ ప్రభుత్వం భారీ డీల్, హైదరాబాద్లో డేటా సెంటర్
అంతర్జాతీయ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ నగరంలో రూ.15,000 కోట్లతో డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్, తెలంగాణ ప్రభుత్వం మధ్య డీల్ ఖరారయింది. హైదరాబాద్ సమీపంలో డేటా సెంటర్ ఏర్పాటుకు 50 ఎకరాల స్థలాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ డీల్ ద్వారా 300 మంది నిపుణులకు ఉద్యోగాలు లభిస్తాయని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో రావొచ్చునని అంటున్నారు.
మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా 200 డేటా సెంటర్స్ను రన్ చేస్తోంది. ఈ అమెరికన్ టెక్ దిగ్గజం 1998లో హైదరాబాద్ నగరంలో అతిపెద్ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (R&D) సెంటర్ను ఏర్పాటు చేసింది. ఓ నివేదిక ప్రకారం ప్రస్తుతం దేశం 499 మెగావాట్ల డేటా సెంటర్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇందులో 49 శాతం ముంబైలో ఉంది. ఆ తర్వాత చెన్నై, పుణే, బెంగళూరులలో 12 శాతం చొప్పున, ఢిల్లీలో 8 శాతం, హైదరాబాద్ 7 శాతం, కోల్కతా 1 శాతంగా ఉంది.
2020 చివరలో హైదరాబాద్లో రెండో డేటా సెంటర్ రీజియన్ను ఏర్పాటు చేయనున్నట్లు అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రకటించింది. ఇందుకు 277 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపింది. కంట్రోల్ ఎస్, ఫ్లిప్కార్ట్తో పాటు మరిన్ని కంపెనీలు కూడా హైదరాబాద్లో డేటా సెంటర్ ఏర్పాటుకు సిద్ధమవుతున్నాయి.