ఆటోకు ఊరట: డిసెంబర్లో పెరిగిన మారుతీ సుజుకీ సేల్స్
2019 సంవత్సరంలో ఆటోమొబైల్ పరిశ్రమకు చేదును మిగిల్చింది. అయితే చివరి నెల డిసెంబర్ మాత్రం కొంతలో కొంత ఊరటను ఇచ్చింది. మారుతీ సుజుకీ సేల్స్ డిసెంబర్ నెలలో పుంజుకున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా సేల్స్ కూడా పెరిగాయి. సాధారణంగా ప్రతి ఏడాది చివరి నెలలో సేల్స్ తగ్గుతాయి. గత కొన్ని నెలలుగా సేల్స్ భారీగా పడిపోయిన నేపథ్యంలో డిసెంబర్ నెలలో మాత్రం పెరిగాయి.
మీకు ఈ స్కాలర్షిప్ గురించి తెలుసా? 2 రోజులో మిగిలి ఉంది?
2.4 శాతం పెరిగిన మారుతీ సేల్స్
2018 డిసెంబర్ నెలతో పోల్చితే 2019 డిసెంబర్లో మారుతీ సుజుకీకి చెందిన పాసింజర్ కార్లు, యుటిలిటీ వెహికిల్స్ సేల్ పెరిగితే వ్యాన్లు, లైట్ కమర్షియల్ వెహికిల్ సేల్ తగ్గింది. మొత్తంగా మారుతీ సేల్స్ 2.4 శాతం పెరిగాయి. ఈ నెలలో మారుతీ సుజుకీ 1,33,296 ప్యాసింజర్ కార్లను విక్రయించింది. ముఖ్యంగా వాగనార్ వంటి కాంపాక్ట్ కారుకు డిమాండ్ బాగా వచ్చింది.
కొన్ని తగ్గాయి.. కొన్ని పెరిగాయి
2018 డిసెంబర్ నెలలో 1,21,479 వాహనాలు విక్రయించగా, ఈసారి 1,24,375 కార్లు విక్రయించినట్లు కంపెనీ వెల్లడించింది. ఎగుమతి చేసిన వాహనాలను కలిపితే సేల్స్ శాతం మరింత ఎక్కువ ఉంది. అయితే ఆల్టో వంటి చిన్న కార్ల విభాగంలో మాత్రం సేల్స్ 13.6 శాతం తగ్గాయి. మధ్యశ్రేణి సియాజ్ విక్రయాలు 62 శాతం తగ్గుదలను నమోదు చేశాయి.
అయితే కాంపాక్ట్ కేటగిరీకి చెందిన స్విఫ్ట్, వాగనార్, సెలిరియో, డిజైర్ విక్రయాలు భారీగా పెరిగాయి. కొత్తగా వచ్చిన ఎస్ ప్రెస్సోకు డిమాండ్ భారీగా ఉండటంతో పాసింజర్ కార్స్ సేల్లో పెరుగుదల 9.1 శాతం నమోదు చేసింది. యుటిలిటీ వెహికిల్ సెగ్మెంట్లో 17.7 శాతం వృద్ధి నమోదయింది. మారుతీ సుజుకీ డిసెంబర్ నెలలో ఎస్ క్రాస్, వితారా బ్రెజ్జా, ఎర్టిగా, జిప్సీ కార్లను 23,808 విక్రయించింది.
ఏప్రిల్ నుంచి 17 శాతం తగ్గుదల
మొత్తంగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ - డిసెంబర్ మధ్య విక్రయాలు మాత్రం 17 శాతం మేర తగ్గాయి. 2019 డిసెంబర్ నెలలో ఎక్స్పోర్ట్స్ సహా అన్ని కలుపుకొని 1,33,296 వాహనాలను విక్రయించింది. ఎక్స్పోర్ట్ సహా అన్ని కలుపుకుంటే మాత్రం 2018 డిసెంబర్తో పోలిస్తే మాత్రం 3.9 శాతం పెరుగుదల నమోదయింది.