ధరలు పెంచుతున్న మహీంద్రా అండ్ మహీంద్రా
మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కొత్త ఏడాదిలో వాహనాల ధరలను పెంచనుంది. పాసింజర్ వెహికిల్, కమర్షియల్ వెహకిల్ ధరలను జనవరి 1 (2021) నుండి పెంచనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ మంగళవారం ప్రకటించింది. పెరిగిన ముడి వనరుల ధరల భారాన్ని కొంతమేర తగ్గించుకునేందుకు ధరలు పెంచాల్సి వస్తోందని తెలిపింది. అయితే ఏ వాహనంపై ఎంత ధరలు పెంచుతున్నారో వెల్లడించాల్సి ఉంది.
ముడి వనరులు పెరగడం వల్ల వాహన తయారీ సంస్థలు ఆర్థికంగా మరింత భారాన్ని మోస్తున్నాయి. దీంతో వాహన ధరలు పెంచక తప్పడం లేదని చెబుతున్నాయి. జనవరి 1వ తేదీ నుండి తమ కార్లపై మూడు శాతం వరకు ధరలు పెంచుతున్నట్లు ఫోర్డ్ కంపెనీ గతంలోనే ప్రకటించింది. జనవరి నుండి ధరలు పెంచుతున్నట్లు మారుతీ సుజుకీ కూడా తెలిపింది. మోడల్స్ను బట్టి ధరల పెరుగుదల ఉంటుంది.
మహీంద్రా కొనుగోలుదారులకు నెలాఖరు వరకు కార్లపై తగ్గింపు బంపరాఫర్ ప్రకటించింది. 2020 ఏడాది ముగియనున్న నేపథ్యంలో ఇటీవల ఆఫర్లు, డిస్కౌంట్ ప్రకటించింది. వివిధ కార్లపై ఏకంగా రూ.3.06 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తోంది. డిసెంబర్ నెల చివరి వరకు మాత్రమే ఈ రాయితీలు ఉంటాయి. దాదాపు అన్ని రకాల మోడల్స్ పైన కొత్త కారు కొనుగోలు చేయాలనే వారికి మహీంద్రా శుభవార్త చెప్పింది. అయితే వచ్చే ఏడాది నుండి ధరలు పెరుగుతుండటం గమనార్హం.