నిర్మలమ్మతో భేటీ, భారత్లో అమెరికా కంపెనీలు మరిన్ని పెట్టుబడులు
భారత్లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు అమెరికాకు చెందిన ఎన్నో కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. భారత్లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని అమెరికాకు చెందిన ప్రయివేటు పెట్టుబడి కంపెనీ బెయిన్ క్యాపిటల్ తెలిపింది. మన దేశంలో ఇప్పటికే ఈ కంపెనీ వివిధ సంస్థల్లో అయిదు బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టింది. భారత్, అమెరికా కలిసి అంతర్జాతీయ స్థాయి వ్యాపారాలను సృష్టించేందుకు కలిసి పని చేయాల్సిన అవసరముందని తెలిపింది. ఇందుకు రానున్న దశాబ్దకాలం చాలా కీలకమని వెల్లడించింది.
వారం రోజుల పర్యటన నిమిత్తం అమెరికాలో ఉన్న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో బెయిన్ క్యాపిటల్ కో-చైర్మన్ స్టీఫెన్ పగ్లియూకా సహా మరికొంతమంది ప్రతినిధులు భేటీ అయ్యారు. గుజరాత్లో రానున్న ఫైనాన్షియల్ సర్వీసెస్ డిస్ట్రిక్ట్ పైన ప్రధానంగా చర్చించినట్లు స్టీఫెన్ తెలిపారు. భారత్లో చేపడుతున్న సంస్కరణలను తాము గత దశాబ్ద కాలంగా గమనిస్తున్నామని బెయిన్ క్యాపిటల్ కో-మేనేజింగ్ పార్ట్నర్ జాన్ కొనాటన్ తెలిపారు. భారత్లో పెట్టుబడి పెట్టాలనే తమ ఆకాంక్ష మరింత పెరుగుతూ వచ్చిందన్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్, ఔట్ సోర్సింగ్, ఫార్మా రంగాల్లో తాము పెట్టుబడులు పెంచుతున్నట్లు తెలిపారు.
ఆర్థికపరంగా భారత్ చేపడుతున్న సంస్కరణలు పాశ్చాత్య ఇన్వెస్టర్లకు బలమైన సందేశాన్ని పంపించాయని అమెరికన్ టవర్ కార్పోరేషన్ ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షులు అన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో భారత్ పెట్టుబడులకు అనువుగా మారిందన్నారు. ప్రస్తుతం భారత్లో ఏటీసీకి చెందిన 76వేల టవర్లు ఉన్నాయని, మరో 4000 టవర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.