ఉద్యోగ కోతలపై హెచ్చరించిన ఖతార్, వేలాదిమంది ఉద్యోగులకు ఉబెర్ షాక్
దుబాయ్: కేబిన్ సిబ్బంది సహా ఉద్యోగులను పెద్ద సంఖ్యలో తొలగించనున్నట్లు దోహా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఖతార్ ఎయిర్వేస్ వెల్లడించింది. కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలు కుదేలైన విషయం తెలిసిందే. చాలా దేశాలు అంతర్జాతీయ విమానాలను అనుమతించడం లేదని, దీంతో తమ సర్వీసులు చాలా వరకు నిలిచిపోయాయని ఖతార్ ఎయిర్వేస్ వెల్లడించింది.
మా ఉద్యోగుల్ని కాపాడుకుంటాం, కోలుకోవడానికి 7 నెలలు పట్టొచ్చు: సర్వేలో ఇంట్రెస్టింగ్
ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటాం
వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా తాము ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటామని ఖతార్ ఎయిర్వేస్ తెలిపింది. పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్లీ విమానయాన రంగం కోలుకున్నాక సిబ్బందిని మళ్లీ పునర్నియమించుకుంటామనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. 1994 నుండి కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థకు 200 విమానాలు ఉన్నాయి.
3,700 మంది ఉద్యోగులను తొలగించనున్న ఉబెర్
మరోవైపు, ఉబెర్ కూడా 3,700 మంది ఉద్యోగులను తొలగించనుంది. ఈ మేరకు అమెరికన్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్కు సమర్పించిన ఫైలింగ్లో తెలిపింది. వివిధ విభాగాల్లో మొత్తం 26,900 ఉద్యోగులకు గాను 14 శాతం మందిని తొలగిస్తోంది ఉబెర్. కంపెనీ సీఈవో దారా ఖోస్రోవ్షాహి వేతనం 2019లో 1 మిలియన్ డాలర్లు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన తన మొత్తం వేతనం వదులుకోనున్నారు.
ఇండియాలోను ఉద్యోగులను తొలగించనున్న ఉబెర్
లాక్ డౌన్ కారణంగా దాదాపు రవణా వ్యవస్థ నిలిచిపోయింది. ఆటో రిక్షాలు, క్యాబ్స్ ప్రజా రవాణా సదుపాయాలు పూర్తిగా నిలిపేశారు. దీంతో ఇబ్బందుులు ఎదుర్కొంటున్న క్యాబ్ రైడర్ ఉబెర్ వచ్చే రెండు వారాల్లో భారత్లో 500 నుండి 700 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది. దాదాపు నిర్ణయం తీసుకున్నారని, లాక్ డౌన్ ముగిసిన తర్వాత ప్రకటిస్తారని అంటున్నారు.