Ethos IPO listing: దెబ్బకొట్టిందిగా..: ఒక్కో షేర్ మీద భారీ నష్టం
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారం తొలి రోజు కళకళలాడుతోంది. లాభాలతో ఆరంభమైంది. స్టాక్స్ అన్నీ ప్లస్సుల్లో ట్రేడ్ అవుతున్నాయి. గ్రీన్జోన్లో ఉన్నాయి. ఈ ఉదయం ఏకంగా 800 పాయింట్ల లాభంతో షేర్ మార్కెట్స్ ప్రారంభం అయ్యాయి. ఆ తరువాత దీని గ్రాఫ్ పైపైకి వెళ్లింది. 900 పాయింట్లను దాటేసింది. 1,000 పాయింట్లకు చేరువగా కనిపించింది. అన్ని ప్రధాన ఇండైసీస్కు చెందిన షేర్లన్నీ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.
మార్కెట్ బాగున్నప్పటికీ.. ఇవ్వాళే స్టాక్ ఎక్స్ఛేంజ్లోకి డెబ్యూ అయిన ఎథోస్ షేర్లు మాత్రం దారుణంగా దెబ్బకొట్టాయి. ఇన్వెస్టర్లకు భారీ నష్టాన్ని పంచాయి. ఒక్కో షేర్ మీద 48 రూపాయల నష్టంతో లిస్టింగ్ అయింది. ఎథోస్ కంపెనీ కటాఫ్ షేర్ ప్రైస్ ధర 878 రూపాయలు. దీనికి భిన్నంగా 830 రూపాయల వద్ద లిస్టింగ్ అయింది. ఆ తరువాత ఏ దశలోనూ షేర్ల ధరలు ప్లస్లోకి రాలేదు. మరింత దిగజారాయి. ఉదయం 11 గంటల సమయానికి రూ.793.50 పైసల వద్ద ట్రేడ్ అవుతూ కనిపించింది.
ఈ నష్టం మరింత పెరుగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. నష్టం అంచనా ఒక షేర్ మీద 100 రూపాయలు దాటొచ్చనీ భావిస్తున్నాయి. కాగా- రూ.472.3 కోట్ల రూపాయలను సమీకరించడానికి ఎథోస్ కంపెనీ కొద్దిరోజుల కిందటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ను జారీ చేసిన విషయం తెలిసిందే. లగ్జరీ రిస్ట్ వాచ్ కంపెనీ ఇది. ఇన్వెస్టర్ల నుంచి పెద్దగా ఆదరణ లభించలేదు. ఐపీఓ ప్రైస్ బ్యాండ్ భారీగా ఉండటమే దీనికి కారణం అనే అభిప్రాయాలు అప్పట్లో వ్యక్తం అయ్యాయి.
ఈ ఐపీఓకు దూరంగా ఉండాలంటూ విశ్లేషకులు సైతం సూచించారు. ఇదిలావుండగా.. ఇముద్ర పబ్లిక్ ఇష్యూ.. ఎల్లుండి స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్ కానుంది. బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లల్లో బెటర్గా లిస్టింగ్ అవుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి. 243-256 ప్రైస్ బ్యాండ్తో పబ్లిక్ ఇష్యూకు వచ్చిందీ కంపెనీ. ఇవ్వాళ రీఫండ్ ప్రాసెస్ నడుస్తోంది. అలాట్మెంట్ మంగళవారం నాటితో ముగుస్తుంది. బుధవారం లిస్టింగ్ అవుతుంది.