LIC IPO: ముహూర్తం ఫిక్స్: దేశ చరిత్రలోఅనే అతి పెద్ద పబ్లిక్ ఇష్యూగా
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో కొనసాగుతోన్న జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ప్రైవేటు పరం కావడానికి యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు సాగుతున్నాయి. లక్షల కోట్ల రూపాయల విలువ చేసే స్థిర, చరాస్తులు ఉన్న ఎల్ఐసీని ప్రైవేటు కంపెనీల చేతుల్లో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నట్లు కనిపిస్తోన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఎల్ఐసీ ప్రైవేటీకరణ ప్రక్రియ ముగించేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తన ప్రయత్నాలు సాగిస్తోంది.
పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఎల్ఐసీ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ను జారీ చేయనుంది. దీనికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ముహూర్తం కూడా పెట్టేసింది. నవంబర్లో దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు అందజేస్తామని ఆర్థిక శాఖ అధికారి ఒకరు తెలిపారు. దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా ఎల్ఐసీ ఆవిర్భవించేలా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఎల్ఐసీ ఐపీఓను జారీ చేసే ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.
దీనికి అవసరమైన తుది గడువు, టైమ్లైన్ను నిర్దేశించుకున్నామని, నవంబర్లో డీఆర్హెచ్పీని సెబీకి సమర్పిస్తామని ఆ అధికారి పేర్కొన్నారు. ఎల్ఐసీ ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇదివరకే 10 మర్చంట్ బ్యాంకులను అపాయింట్ చేసిన విషయం తెలిసిందే. గోల్డ్మన్ సాచ్ ఇండియా సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్, సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, నొమురా ఫైనాన్షియల్ అడ్వైజరీ అండ్ సెక్యూరిటీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వంటి టాప్ కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి.
ఎస్బీఐ క్యాపిటల్స్ మార్కెట్స్ లిమిటెడ్, జేఎం ఫైనాన్షియల్ లిమిటెడ్, యాక్సిస్ క్యాపిటల్ లిమిటెడ్, బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్, జేపీ మోర్గాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, కొటక్ మహీంద్రా క్యాపిటల్ వంటి ఇతర బ్యాంకర్లను కూడా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఐపీవో ముసాయిదా సమర్పించగానే మర్చంట్ బ్యాంకర్లు.. వచ్చే సంవత్సరం జనవరిలోపు పెట్టుబడిదారులతో జాతీయ, అంతర్జాతీయ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు.
ఇప్పటికే ఐపీవో కోసం సిరిల్ అమర్చంద్ మంగళ్దాస్ను న్యాయ సలహాదారుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. స్టాక్ మార్కెట్లో ఎంట్రీ ఇవ్వడానికి ముందే ఎంత పరిమాణంలో పబ్లిక్ ఇష్యూను జారీ చేయాలనే విషయాన్ని లెక్కించడానికి మిల్లిమన్ అడ్వైజర్స్ ఎల్ఎల్పీని సైతం నియమించింది. మొత్తం ఈ ఐపీవో ద్వారా రూ.1.75 లక్షల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. పబ్లిక్ ఇష్యూలను కొనుగోలు చేయడానికి ఫారిన్ పోర్ట్ ఫోలియోలకు కూడా అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.