భారత్కు సహకారం: జోబిడెన్, అమెరికాకు భారత్ పంపిన విషయం గుర్తు చేసిన నేతలు
కరోనాతో ఇబ్బందిపడుతున్న భారత్కు కావాల్సిన సహకారం అందిస్తామని అమెరికా అధ్యక్షులు జోబిడెన్, ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ హామీ ఇచ్చారు. కరోనా కట్టడిలో ఉపయోగపడే కీలక వైద్య పరికరాలు, ఇతర సరఫరాలను భారత్కు పంపిస్తామన్నారు. మొదటి దశ విజృంభణ సమయంలో అమెరికా ఆసుపత్రులపై తీవ్ర ఒత్తిడి నెలకొనగా, భారత్ తమకు అండగా నిలబడిందని బైడెన్ గుర్తు చేశారు.
అదే విధంగా ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్న భారత్కు సహకరిస్తామన్నారు. కోవిషీల్డ్ టీకా తయారీకి కావాల్సిన ముడి పదార్థాల ఎగుమతులపై నిషేధం ఎత్తివేస్తూ ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవన్ చేసిన ప్రకటనను బైడెన్ తన ట్వీట్కు జత చేశారు. భారత దేశంలో కరోనా విజృంభణ ఆందోళనకరంగా ఉందని కమలాహారిస్ అన్నారు.
సాయమందిస్తూనే హెల్త్ కేర్ వర్కర్లతో పాటు భారత ప్రజల క్షేమం కోసం ప్రార్థిస్తున్నామన్నారు. భారత్లో సెకండ్ వేవ్ పైన వీరు స్పందించడం ఇదే తొలిసారి. అంతకుముందు భారత్కు అండగా నిలవకపోవడంపై సొంత పార్టీలోని భారత సంతతి నేతల నుండి తీవ్ర విమర్శలు వచ్చాయి. మిగులు టీకాలతో పాటు అవసరమైన వైద్య పరికరాలు పంపాలని వారు ఒత్తిడి చేశారు. గతంలో భారత్ హైడ్రాక్సీక్లోరోక్విన్ వంటి ఔషధాల్ని అమెరికాకు పంపిన విషయాన్ని గుర్తుచేశారు.