5 నెలల్లో 25 లక్షల మందికి రూ.88,652 కోట్లు రీఫండ్
ఈ ఆర్థిక సంవత్సరంలో(2021-22) ఇప్పటి వరకు దాదాపు 25 లక్షలమంది ట్యాప్స్పేయర్స్కు రూ.88,652 కోట్ల ఐటి రీఫండ్స్ చెల్లించినట్లు ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. ఇందులో భాగంగా 23.05 లక్షలకు పైగా పన్ను చెల్లింపుదారులకు, వ్యక్తిగత ఆదాయపు పన్ను రీఫండ్స్, రూ.28,180 కోట్లు, 1.58 లక్షల పన్ను చెల్లింపుదారులకు కార్పోరేట్ ట్యాక్స్ రీఫండ్స్ కింద రూ.60,472 కోట్లు చెల్లించినట్లు తెలిపింది. ఈ మేరకు ఐటీ శాఖ ట్వీట్ చేసింది.
ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినా రీఫండ్ కాలేదా? ఇలా చేసి చూడండి!
ఐటీ శాఖ ట్వీట్
'సీబీడీటీ 24.64 లక్షలకు పైగా పన్నుచెల్లింపుదారులకు రూ.88,652 కోట్ల మొత్తాన్ని ఏప్రిల్ 1వ తేదీ నుండి రీఫండ్ చేసింది. 23,05,726 పర్సనల్ ఇన్కం ట్యాక్స్(PIT)దారులకు రూ.28,180 చెల్లించడం జరిగింది. 1,58,280 ట్యాక్స్పేయర్స్కు కార్పోరేట్ ట్యాక్స్ రీఫండ్స్ మొత్తం కింద రూ.60,472 చెల్లించడం జరిగింది' అని ఇన్కం ట్యాక్స్ డిపార్టుమెంట్ ట్వీట్ చేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో జనాల వద్ద డబ్బులు ఉండేలా కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఎలాంటి ఇష్యూ లేనివారికి ఐటీ రీఫండ్స్ చెల్లింపులు జరపాలని కేంద్రం నిర్ణయించింది.
రీఫండ్స్ వేగవంతం
పెండింగ్లోని రూ.5 లక్షల లోపు రీఫండ్స్ వేగంగా చెల్లిస్తామని ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ మేరకు ప్రారంభంలో వారంలోనే రూ.4వేల కోట్లకు పైగా రీఫండ్స్ చేసింది. ఈ ఐదు నెలల కాలంలో రూ.88వేల కోట్లకు పైగా రీఫండ్ చేసింది. కరోనా మహమ్మారి పరిస్థితుల్లో పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు పడకుండా ఈ ప్రక్రియను చేపట్టింది.
వారు ఎంత త్వరగా సమాధానం ఇస్తే..
కొన్ని కేసుల్లో వివరాలు అడుగుతూ ఐటీ శాఖ.. ఈ మెయిల్ సందేశాలు పంపిందని, వారు దానికి ఎంత తొందరగా సమాధానం ఇస్తే అంత త్వరగా రీఫండ్ ప్రాసెస్ చేస్తామని అంతకుముందు పలుమార్లు సూచించింది ఐటీ శాఖ. పన్ను చెల్లింపుదారులకు సంబంధించి బ్యాంకు ఖాతాల్లో ఈ రిఫండ్ జమ చేస్తున్నామని, ఈ రిఫండ్ గురించి ఎవరు డిపార్టుమెంటును సంప్రదించాల్సిన అవసరం లేదని, తెలిపింది. రిఫండ్ కోసం సంబంధించి ఆదాయపన్ను శాఖ పంపిన ఈ మెయిల్స్కు వెంటనే స్పందించాలని ట్యాక్స్ పేయర్స్కు సూచించింది.